Publish Date: Wed, 14 Nov 2018 (21:54 IST)
Updated Date: Wed, 14 Nov 2018 (22:14 IST)
సాధారణంగా మన శరీర తత్వాన్ని బట్టి, మనం తినే ఆహారాన్ని బట్టి, సూర్యరశ్మి చర్మంపై ఎక్కువుగా పడటం వలన కూడా మనకు మెుటిమలు వస్తూ ఉంటాయి. ఇవి ఎంతో ఇబ్బందిని కలిగించడమే కాకుండా చూడటానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటాయి. మొటిమలు రావడం వలన ముఖముపై నల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. బయటకు వెళ్ళేటప్పుడు చర్మానికి సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేయడం ఎంతైనా అవసరం, బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని గృహ చిట్కాలను పాటించడం వలన మొటిమలు వాటివల్ల కలిగే మచ్చల నుంచి విముక్తి పొందవచ్చు అవి ఏమిటో చూద్దాం.
1. ఒక టమాటోని తీసుకొని పేస్టు చేసి టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత వేడి నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన మెుటిమల నుండి విముక్తి పొందవచ్చు.
2. కలబంద ఆకుల నుంచి గుజ్జుని తీసి 5 నిమిషముల పాటు ఎండపెట్టాలి. తరువాత దానిలో ఎండిన నిమ్మపండు రసాన్ని 5-6 చుక్కలు కలపాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 15 నిమిషముల తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందగలరు.
3. ఉల్లిపాయలో సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నవి, అందువలన ఇది మొటిమలను వాటి మచ్చలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి, మిక్సర్ సహాయంతో పేస్టు చేయాలి. తరువాత ఆ పేస్టు నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషముల తరువాత ముఖాన్ని నీటితో కడగాలి. ఇలా వారానికి 3సార్లు చొప్పున చేయడం వలన ముఖంపై మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.
4. రెండు టేబుల్ స్పూనుల గంధపు పొడిని తీసుకొని సరిపడే గులాబీ నీటిని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఎండిన తరువాత నీటితో కడగాలి. ఇది చర్మానికి మంచి మెరుపును ఇస్తుంది.
5. చిటికెడు పసుపు తీసుకుని దానిలోకి నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖముపై మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజు చేయడం వలన మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.