Publish Date: Mon, 16 Feb 2015 (14:48 IST)
Updated Date: Wed, 08 Apr 2015 (16:49 IST)
తమలపాకులు, వక్కలు, సున్నం కలిపిన తీసుకోవడాన్ని తాంబూలం అంటారు. భారత సాంప్రదాయ పద్ధతులలో ఒకటైన తాంబూల సేవన అజీర్ణానికి బాగా ఉపకరిస్తుంది. తమలపాకుల్లో కొంచెం తీపి, కొంచెం వగరు కలిగి ఉంటుంది. ఇది కఫాన్ని హరిస్తుంది. అయితే పిత్తాన్ని మాత్రం ఎక్కువ చేస్తుంది.
తాంబూలంలో వక్కలతో పాటు ఏలకలు, లవంగ ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. అవి నోటి దుర్వాసనను పారద్రోలడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాంబూలంలో ఉదయాన వక్క ఎక్కువగానూ, రాత్రి సున్నము ఎక్కువగా ఉండేలా తయారు చేసుకోవాలి.
తాంబూలము నమిలేటప్పుడు మొట్టమొదట వచ్చే రసం విషపూరితంగా ఉంటుందని చెపుతారు. రెండవసారి నమిలినపుడు వచ్చే రసము - అజీర్ణమునకు కారణమవుతుందని అంటారు. మూడవసారి జనించే రసము అమృతంతో సమానం అంటారు. కాబట్టి తాంబూలం వేసుకొన్న తర్వాత మొదట నోట్లో ఊరిన లాలాజలాన్ని ఉమ్మివేస్తూ చివరి లాలాజలాన్ని మాత్రమే మింగుట ఆరోగ్యకరమని చెపుతారు. కనుక తాంబూలం వేసుకునే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.