తిరుమలలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాకారి డి సాంబ శివరావు ఆదివారం రాత్రి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. అప్పటికప్పుడు ఈవో ఉన్నట్టుండి ఈవో తనిఖీలకు బయలుదేరడంతో అధికారులు ఉరుకులు పరుగుల మీద తమ పరిదిలోని ప్రాంతాలకు చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి రానున్నడంతో ఈవో దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆదివారం కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ తిరుమలలోనే గడిపారు. సమీక్ష అనంతరం బయటకు వస్తూ నేరుగా తనిఖీలకు బయలుదేరడంతో అధికారులు ఇబ్బందుల పాలు కాకతప్పలేదు.
ఈవో తొలత ఏటీసి ప్రాంతంలోని క్యూలైన్లను తనిఖీ చేశారు. విపరీతమైన చలి ఉన్న సమయంలో టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వికాస్ విశ్రాంతి భవనం వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లను పరిశీలించారు. ప్రతీ ఒక్కటీ క్షుణ్ణంగా చెక్ చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తిరుమలలో కనీసం 5500 గదులు ఉన్నాయని, వాటిలో కనీసం 40 వేల మందికి వసతి ఉంటుందని, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాటిలో మరో 12 వేల మందికి వసతి ఏర్పాట్లు ఉన్నాయన్నారు.
అదే సమయంలో తమ అధికారులు 24 గంటలూ భక్తులకు తిండి, నీరు అందజేస్తున్నారని చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం జరుగకుండా చూస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తనిఖీలలో తిరుమల జేఈవో శ్రీనివాసరాఉ, ఎస్ఈ రమేష్ రెడ్డి, అదనపు సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.