Publish Date: Thu, 11 Dec 2014 (15:02 IST)
Updated Date: Thu, 11 Dec 2014 (15:08 IST)
సీతమ్మను వెతకడానికి లంకానగరం వైపు హనుమన్న వెళ్లేందుకు సిద్ధపడతాడు. తాను రాముడు పంపించగా వచ్చిన దూతననే విషయాన్ని సీత విశ్వసించాలంటే, రాముడు బాగా ఉపయోగించే వస్తువుల్లో ఆమెకి బాగా తెలిసిన దానిని గుర్తుగా ఇవ్వమని హనుమంతుడు అడుగుతాడు.
అప్పుడు రాముడు తన చేతికి గల ఉంగరాన్ని తీసి హనుమంతుడికి ఇస్తాడు. పైన ఒక పెద్దమణి ... కింద రెండు చిన్న మణులు పొదిగిన ఆ ఉంగరం అంటే రాముడికి ఎంతో ఇష్టం. ఎప్పుడూ కూడా ఆయన దానిని తన చేతి నుంచి తీసేవాడుకాదట. ఈ మూడు మణులు ఆయన నామాన్ని సూచిస్తూ ఉండేవట.
ఆ ఉంగరాన్ని సీత వెంటనే గుర్తిస్తుందని రాముడు చెప్పడంతో, దానిని తీసుకుని హనుమంతుడు బయలుదేరుతాడు. సీతమ్మవారి జాడ తెలుసుకుని ఆమెకి ఆ ఉంగరాన్ని చూపించి సంతోషాన్ని కలిగిస్తాడు. ఈ నేపథ్యంలో .. హనుమంతుడికి రాముడు ఇచ్చిన ఆ ఉంగరం మహాశక్తిమంతమైనదని, ఆయన తన తపోశక్తినంతా ఆ ఉంగరంలో నిక్షిప్తం చేసేవాడని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
అత్యంత శక్తిమంతమైన ఆ ఉంగరం శత్రువుల నుంచి రక్షణ కల్పిస్తుంది. తన కోసం హనుమంతుడు శత్రువుల మధ్యకి వెళుతున్న నేపథ్యంలో.. శత్రువు నుంచి హనుమంతుడి రక్షణార్థం ఉంగరాన్ని ఇచ్చిపంపుతాడు. అందుకే ఆయన క్షణమైనా ఆలస్యం చేయకుండా తన దగ్గరున్న ఉంగరాన్ని హనుమంతుడికి ఇస్తాడు.
తన గుర్తుగా సీతాదేవికి అందించాలనే కాదు, అది హనుమంతుడిని రక్షిస్తూ ఉంటుందనే ఉద్దేశం కూడా ఆయనకి రాముడు ఉంగరాన్ని ఇవ్వడంలో కనిపిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.