తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోని అన్ని సంస్థలకు కలసి స్థానికంగా ఉన్న ఓ భక్తుడు రూ. 74 లక్షల విరాళంగా ఇచ్చారు. ఆయన చెక్కను తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావుకు గురువారం అందజేశారు. మాజీ మంత్రి చదలవాడ కృష్ణ మూర్తి సమక్షంలో ఈ చెక్కును టీటీడీకి విరాళంగా ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.
తిరుపతిలోని ఎన్జీవో కాలనీకి చెందిన విశ్వనాథ బాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం అందజేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే రూ. 74 లక్షల చెక్కును అందించారు. ఇందులో రూ.50 లక్షలు ప్రాణదానానికి, పది లక్షలు విద్యాదాన ట్రస్టుకు, ఐదు లక్షలు నిత్యన్న ప్రసాదానికి, బర్డ్, బాలమందిర్, హెరిటేజ్ ప్రిజర్వేషన్, గోసంరక్ష, వేద పరిరక్షణ, శ్రీనివాస శంకర నేత్రాలయకు రూ. 1.5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు.