Publish Date: Sat, 19 Sep 2015 (12:25 IST)
Updated Date: Sat, 19 Sep 2015 (12:31 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగోరోజు శ్రీవేంకటేశ్వర స్వామి కల్పవృక్షవాహనంలో వైభవంగా తిరుమాడ వీధులలో ఊరేగారు. కల్పవృక్ష వాహనంపై శ్రీవారి దర్శించుకున్న జనం తరించిపోయారు. వాహనం ఉదయం 9గంటలకు వాహన మండపం నుంచి బయలు దేరింది. ఈ ఊరేగింపు రెండుగంటల పాటు తిరుమాడ వీధులలో సాగింది. భక్తులు కొన్ని ప్రాంతాలలో కర్పూర హారతులు ఇచ్చి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు.
ఉభయ దేవేరులతో కలిసి శ్రీనివాసుడు తిరువీధుల్లో వూరేగుతూ భక్తులను కటాక్షించారు. వేదపండితులు మంత్రోచ్ఛరణలు జరుపుతుండగా స్వామి తిరుమాడ వీధులలో ఊరేగారు. టీటీడీ అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.