Publish Date: Wed, 06 May 2015 (20:56 IST)
Updated Date: Wed, 06 May 2015 (20:59 IST)
ఊరంతా బైరాగులే.. ఏ బజార్లో చూసినా వారే.. వళ్ళంతా బూడిద పూసుకుని వేపమండలు చేతపట్టుకుని కనిపించిన వారందరి భరతం పడుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను కూడా విడిచిపెట్టడంలేదు. తిరుపతిలో ఎక్కడ చూసినా ఒకటే కోలాహలం. బైరాగులే బైరాగులు.. ఎందుకు ఏమా కథ.
తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర బుధవారం తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యింది. బుధవారం బైరాగి వేషంలో భక్తులు తిరుపతి చిన్న గంగమ్మను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. దాదాపు వారానికిపై జరిగే తిరుపతి గంగజాతర కోలాహలంగా సాగుతుంది. అందులో భాగంగా బుధవారం భక్తులు దర్శించుకుంటారు. అందుకు కూడా ఓ పురాణ నేపథ్యం ఉంది.
గంగమ్మను మోహించిన పాలెగాడు తన చేయి పట్టుకొని అవమానించాడని గంగమ్మ దేవత అతని కోసం వివిధ వేషాల్లో నగరంలో గాలింపు చేపడుతుందని నమ్మకం. అందుకే వేషాల రోజుల్లో మొదటి రోజు బుధవారం బైరాగి వేషం వేయడం ఆనవాయితీ. చాటింపు వేశారని తెలియగానే కుర్రకారు, చిన్నపిల్లల్లో ఆనందం ఉరకలు వేస్తుందని చెప్పవచ్చు. వారం రోజుల పాటు వివిధ వేషాల్లో జీవితాన్ని భిన్నంగా గడపవచ్చనే ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉంటుంది.
దీనిని తీర్చుకోవడానికి గ్రీష్మతాపం, వానలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు బైరాగి వేషం శరీరమంతా నామంకొమ్ము, విభూతి పూసుకొని రేళ్లకాయలమాలలు ధరించి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. వేషంతో ఇంటి దగ్గర బయల్దేరినప్పటి నుంచి బూతులతో జనాలను భయపెట్టినా, పసుపు, కుంకుమలు, వేపాకు సమర్పించి అమ్మవారి పాదాలపై ప్రణమిల్లుతారు. తరాల తారతమ్యం భక్తి భావనకు అడ్డురాదని నిరూపిస్తూ వేషాలు వేయడానికి జనం పోటీ పడతారు.