Publish Date: Wed, 31 Dec 2014 (11:09 IST)
Updated Date: Wed, 31 Dec 2014 (14:14 IST)
వైకుంఠ ఏకాదశి సందర్భంగా క్యూ లైన్లలోకి తమను అనుమతించలేదని శ్రీవారి భక్తులు తిరుమలలో ఆందోళనకు దిగారు. ధర్నా చేపట్టారు. వెంటనే తమను అనుమంతించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం ఉదయం మండిపడ్డారు. అళ్వార్ ట్యాంకు సమీపంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
వైకుంఠ ఏకాదశి కారణంగా భక్తులు తిరుమలకు ముందుగానే చేరుకుంటారు. అదే విధంగా ఈ ఏడాది కూడా బుధవారం ఉదయం నుంచి తిరుమల చేరుకున్నారు. వీరు సహజంగా క్యూలైన్లలో వేచి ఉండి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటారు. తమను క్యూలైన్లోకి అనుమతించాలని కొందరు భక్తుల టిబిసి 122 వద్ద ఉన్న క్యూలైను ప్రవేశ ద్వారం వద్దనున్న వారిని అడిగారు.
లోనికి అనుమతించడానికి వారు నిరాకరించడంతో శ్రీవారి భక్తులు, గోవింద మాలలో ఉన్న భక్తులు అక్కడే రోడ్డుపై బైటాయించారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమను వెంటనే క్యూలైన్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు అక్కడకు చేరుకుని వారికి నచ్చజెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. క్యూలైన్లలోకి అనుమతించారు.