రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బెంగళూరు ఎయిర్ షోకు వచ్చిన ఆయన బి కొత్తకోట, తిరుపతిలలో కార్యక్రమాలను ముగించుకున్న తరువాత రాత్రి పొద్దుపోయాక తిరుమలకు చేరుకున్నారు. అక్కడే పద్మావతి అతిథి గృహంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అక్కడే బస చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున విఐపి బ్రేక్ దర్శన సమయంలో ఆయన వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. సిఎంతోపాటు మంత్రులు నారాయణ, బొజ్జల గోపాల కృష్ణా రెడ్డిలు కూడా ఉన్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈశో సాంబశివరావు తీర్థప్రసాదాలను అందజేశారు.