Publish Date: Tue, 24 Aug 2021 (23:22 IST)
Updated Date: Tue, 24 Aug 2021 (23:24 IST)
ఒక స్పూన్ తేనెకు అర టీస్పూన్ జీలకర్ర పొడిని వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా తీసుకోవడం వలన మంచి ఫలితాన్ని పొందవచ్చు. జీలకర్ర తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి, ఉదర సంబందిత సమస్యలను చాలావరకు తగ్గిస్తుంది.
ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా దాల్చిన చెక్క పొడిని వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి తీసుకున్నట్లయితే కడుపు నొప్పి సమస్యను తగ్గించుకోవచ్చు.
నిమ్మకాయ ఆరోగ్యానికి ఔషధం అని చెప్పవచ్చు. నిమ్మకాయలో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ పుదీనా రసం మరియు ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని దీనికి కొద్దిగా ఉప్పు కలిపి తీసుకున్నట్లయితే కడుపునొప్పి సమస్యను నివారించుకోవచ్చు.
ఇంగువ, యాలుకలు, శొంఠి, సైంధవ లవణం సమానంగా తీసుకుని మెత్తగా పొడిలాగా చేసుకుని ఉదయం సాయంత్రం అరస్పూన్ చొప్పున తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవడంతో పాటు కడపులోని గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గి శరీరం తేలికగా ఉంటుంది.
కడుపులో ఏర్పడే నొప్పిని తగ్గించడంలో బేకింగ్ సోడా అద్బుతంగా పని చేస్తుంది. బేకింగ్ సోడా ఆంటాసిడ్ గుణాలను కలిగి ఉంది. ఒక స్పూన్ బేకింగ్ సోడాను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వలన కడుపునొప్పి త్వరగా తగ్గుతుంది.
బొప్పాయిని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసి రోజూ అరస్పూన్ పొడిని తగినంత తేనె కలిపి తీసుకుంటే కడుపునొప్పి, మలబద్దకం, అజీర్తి, వికారం, ఆకలి లేకపోవడం లాంటి ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
పంచదార మరియు జీలకర్రను నమిలి తిన్నా మంచి ఫలితం ఉంటుంది. తులసి మరియు పుదీనా ఆకులను కలిపి నమిలినట్లయితే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుముఖం పడతాయి. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడిని వేసి తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం మరియు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.