Publish Date: Tue, 12 Feb 2019 (21:58 IST)
Updated Date: Tue, 12 Feb 2019 (22:00 IST)
అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉండే వెల్లుల్లిని మన పురాతన కాలం నుండి అనేక ఔషధాల తయారీలో వాడుతున్నారు. మనం వండే కూరలకు వెల్లుల్లిని కలపటం ద్వారా భిన్నమైన రుచి వస్తుంది. వెల్లుల్లి రెబ్బలను వంటలకే కాదు, మెత్తగా చేసి పాలలో కలుపుకొని తాగుతారు మరియు దీని నుండి తీసిన రసాన్ని రోజు ఉదయాన పరగడుపున గోరువెచ్చని నీటిలో కలుపుకొని కూడా తాగుతారు. ఇలా చేయటం వలన శరీర బరువు కూడా తగ్గుతుంది. వెల్లుల్లి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్యప్రయోజనాలేమిటో చూద్దాం.
1. వెల్లుల్లిని రోజు మన ఆహార పదార్థంలో చేర్చుకోవటం వలన శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా వెల్లుల్లి రసాన్ని రోజు తాగటం వలన ధమనులలో అడ్డంకులను తొలగించి, రక్త ప్రసరణను మెరుగుపరచి, గుండె వ్యాధులకు గురవకుండా పరోక్షంగా సహాయపడుతుంది.
2. వెల్లుల్లి రసం మొటిమలను నివారించి మృదువైన చర్మాన్ని అందించుటలో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి రసాన్ని తీసుకొని, కేవలం మొటిమలపై మాత్రమే అప్లై చేసి, కొద్ది సేపటి తరువాత కడిగి వేయండి. ఇలా కొన్ని రోజుల పాటూ అనుసరించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిను ముఖానికి పెట్టుకొని పడుకోకూడదు. దీని వలన చర్మానికి హాని కలగవచ్చు.
3. వెల్లుల్లి రసం జుట్టు రాలటాన్ని కూడా తగ్గించటమే కాకుండా, రాలిన వెంట్రుకలు మళ్ళి పెరిగేలా చేస్తుంది. అదెలాగంటే, జుట్టు రాలిన ప్రదేశంలో వెల్లుల్లి రసాన్ని అప్లై చేయండి. ఇలా రోజులో రెండు సార్లు అప్లై చేయటం వలన బట్టతల కలిగే అవకాశం ఉండదు. కానీ తలపై ఈ రసాన్ని అప్లై చేసేపుడు కళ్ళ పడకుండా జాగ్రత్తగా ఉండండి.
4. చలికాలంలో వెల్లుల్లి రసాన్ని రోజు తాగటం వలన ఆస్తమా వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. రోజు ఉదయాన పరగడుపున ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో రెండు చెంచాల తేనె మరియు ఒక చెంచా వెల్లుల్లి రసాన్ని తాగండి.
5. వెల్లుల్లి రసాన్ని ఒక గ్లాసు దానిమ్మ రసంలో కలుపుకొని తాగటం వలన దగ్గు నుండి ఉపశమనం పొందుతారు మరియు వేడి నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి పుక్కిలించటం వలన గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందుతారు.