Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో కొత్త రోగాలు... వణికిపోతున్న కోవిడ్ విజేతలు...

కరోనాతో కొత్త రోగాలు... వణికిపోతున్న కోవిడ్ విజేతలు...
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (13:01 IST)
కరోనా వైరస్ బారినపడి అదృష్టవశాత్తు కోవిడ్ విజేతలుగా నిలుస్తున్న వారు భయంతో వణికిపోతున్నారు. దీనికి కారణం, కరోనా వైరస్ కారణంగా కొత్త రోగాలు అంటే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో మళ్లీ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కోవిడ్ విజేతల్లో సంతోషం మిగలడం లేదు. ఇది కోలుకున్న అందరి సమస్య కాకపోయినా కొందరికి మాత్రం తీవ్ర సమస్యగా మారింది. 
 
ముఖ్యంగా ఊపిరితిత్తులను కేంద్రంగా చేసుకొని దాడి చేస్తున్న కరోనా వైరస్‌ చికిత్సతో అంతరించి పోయాక శ్వాస కోశాలు మునపటిలా వికసించడం లేదు. వైరస్‌ లోడ్‌ అధికంగా ఉండి బయట పడిన వారి శ్వాసకోశాల్లో ఫైబ్రోసిస్‌ సమస్య ఏర్పడుతోంది. దాంతో శ్వాస తీసుకున్నపుడల్లా బెలూన్‌లా ఉబ్బాల్సిన ఊపిరితిత్తులు గట్టిపడిపోయి మొత్తం సామర్థ్యం మేరకు పని చేయలేకపోతున్నాయనీ, ఇంకా ఇతర సమస్యలు కూడా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. 
 
కరోనా వైద్యంలో  కొన్ని రకాల స్టెరాయిడ్స్‌ కొందరు రోగులకు ఇస్తారు. అవి పూర్తి కాలం, సరైన డోస్‌ వేసుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే, కరోనా వచ్చిపోయిన తర్వాత కొందరిలో ఊపిరితిత్తుల్లో మచ్చలు(పల్మనరీ ఫైబ్రోసిస్‌) ఏర్పడతాయి. సాధారణంగా ఇన్‌ఫెక్షన్‌ తగ్గితే మచ్చలు మానిపోవాలి. కొందరిలో వైరస్‌ తీవ్రత కారణంగా పల్మనరీ ఫ్రైబోసిస్‌ దీర్ఘకాలంగా ఉంటుంది.
 
ఈ మచ్చలు మానకపోతే పుండుగా మారే ప్రమాదముంది. ఊపిరిత్తులు సాగే గుణం కోల్పోయి, కుంచించుకు పోతాయి. మచ్చలు నయంకాకపోతే కరోనా తగ్గిన 4 నెలల తర్వాత ఆయాసం వంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మెట్లు ఎక్కడంలో ఆయాసం, కొద్ది దూరం నడవగానే ఊపిరి తీసుకోవడం కష్టమై కూలబడి పోవడం కనిపిస్తుంది. 
 
కరోనా నుంచి కోలుకున్న రోగుల్లోని కొందరిలో రక్తం చిక్కబడుతుంది. ఇలాంటి సమయంలో రక్త సరఫరాలో అవరోధాలు (బ్లడ్‌ క్లాట్స్‌) ఏర్పడతాయి. కాళ్లలో గడ్డలుగా ఏర్పడటం, రక్త సరఫరా నిలిచిపోవడం, బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండె స్పందనలు ఆగిపోవడం చోటుచేసుకునే ముప్పు ఉంటుంది. కరోనా వైద్యంలో వినియోగించిన కొన్ని రకాల మందుల వల్ల ఫంగస్‌, క్షయ ముప్పు ఉంటుంది. కరోనా తగ్గిన 3-4 నెలల తర్వాత ఈ సమస్యలు మొదలవుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచినీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయా?