Publish Date: Tue, 22 Jan 2019 (14:34 IST)
Updated Date: Tue, 22 Jan 2019 (16:36 IST)
కమలాపండు రుచిభరితమైనది, పోషక పదార్థములు ఎక్కువ కలిగి ఉంటుంది. కమలాపండు తొనలను, తొనల రసం పళ్ళ చివళ్ళకు తగిలేలా బాగా నమిలి మ్రింగాలి. దీనివలన పంటి నొప్పులు, నోటి దుర్వాసన తొలగిపోతాయి. పళ్ళలోని సూక్ష్మక్రిములు నశిస్తాయి. ఈ పండులోని పీచు పదార్థం మలబద్దకాన్ని పోగొడుతుంది. దీనిలో ముఖ్యంగా తేమ, కొవ్వు పదార్థం, ధాతువులు అధిక మోతాదులో ఉంటాయి.
ఇవి శరీర ఉష్ణమును తగ్గించి చలువచేస్తాయి. చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. చర్మ సంబంధమైన వ్యాధుల్ని నయం చేస్తుంది. శరీర కాంతిని పెంచుతుంది. స్త్రీలు బహిష్టు సమయంలో సేవిస్తే అలసట పోగొడుతుంది. అరకప్పు కమలాపండు రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తే తీవ్రమైన జ్వరం కూడా తగ్గుతుంది. ఈ విధంగా ఆరు పూటలు సేవించాలి.
ప్రతిరోజూ ఒక గ్లాస్ కమలాపండు రసం సేవిస్తే బలహీనులైనవారు బలవంతులుకాగలరు. ప్రతిరోజూ ఒక కమలాపండు చొప్పున రెండు మాసాలు తీసుకుంటే రక్తవృద్ధి చేకూరుతుంది. దంతాలు పటిష్టంగా ఉంటాయి. విరేచనములు అరికట్టడానికి, అరకప్పు కమలాపండు రసంలో ఆరు స్పూన్ల తేనె కలిపి మూడు గంటల కొకసారి చొప్పున నాలుగయిదు పర్యాయములు సేవించాలి.
కమలాపండు తొక్కలను ఎండబెట్టుకుని పొడిచేసి అందులో కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే.. కడుపునొప్పి రాదు. ఈ మిశ్రమం స్త్రీలకు ఎంతగానో దోహదపడుతుంది. కమలా పండులోని క్యాల్షియం, భాస్వరం, ఇనుము, విటమిన్ సి వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి.