సాధారణంగా విరెచనాలంటేనే శరీరం ఒక్కమారుగా బలహీన పడుతుంది. అతిసారమంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదరంలో కలిగే మార్పుల వల్ల అతిసారం సంభవిస్తుంది. ఇది సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే పిలువని పేరంటంలా ముందు వచ్చి కూర్చుంటుంది. అపరిశుభ్ర పరిసరాలు ఇందుకు ఆవాసాలవుతాయి. తేడా వస్తే మనిషి ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
వ్యాధి లక్షణాలు
వళ్ళు నీరసంగా ఉంటుంది. మలం నీళ్ళగా రావడం (నీళ్ళవిరెచనాలు), లూజ్ మోషన్స్ వస్తుంటాయి. కడుపు నొప్పి కలుగుతుంది. సొమ్మసిల్లి పడిపోయే అవకాశం ఉంది.
ఎపుడు వస్తుంది ?
పరిసరాలు పరిశుభ్రంగా ఉండకపోతే అతిసారం ఆ ప్రాంతాన్నే కబళిస్తుంది. నీరు, ఆహారం కలుషితమైనా సరే అతిసారం ఇట్టే సోకుతుంది. ప్రత్యేకించి, జాతరలు, జనసమూహాలు ఎక్కువగా గుమికూడిన చోట ఆహార జాగ్రత్తలు పాటించకపోతే ఈ రోగాన్ని కొని తెచ్చుకున్నట్టే.
నివారణ ఎలా ?
ఇంటి బయట ఆహారం తీసుకోవడాన్ని పూర్తిగా నివారించాలి. కాచి వడపోసిన నీటినే తాగాలి. విరెచనాలతో శరీరంలో సత్తువ బయటకు పోతుంది. కాసింత ఉప్పు, చక్కెర, కాచివడపోసిన నీటిలో కలుపుకుని తాగాలి. ఎలక్ట్రాల్ పౌడరు తాగడం మంచిది. ఇవన్నీ కూడా ప్రాథమిక చికిత్సలు, రాకమునుపు తీసుకునే జాగ్రత్తలు. అతిసారం సోకిన తరువాత వీలైనంత తొందరగా డాక్టరును సంప్రదించాలి.