Publish Date: Thu, 24 Mar 2022 (16:08 IST)
Updated Date: Thu, 24 Mar 2022 (16:15 IST)
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ఇన్ఫెక్షియస్ కిల్లర్లలో ఒకటైన క్షయవ్యాధి, దాని పర్యవసానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ టిబి దినోత్సవాన్ని జరుపుకుంటారు. “ ప్రతిరోజు 4100 మందికి పైగా ప్రజలు క్షయతో తమ ప్రాణాలను కోల్పోతున్నారు.
2,80,000 మంది ప్రజలు క్షయవ్యాధితో బాధపడుతున్నారు, అయినప్పటికీ క్షయ వ్యాధి నివారించదగిన, చికిత్స చేయగల వ్యాధి. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఈ సమస్యలపై మరోసారి అవగాహన కల్పించాలి. ప్రపంచ టిబి డే 2022 యొక్క థీమ్ - “క్షయని అంతం చేయడానికి పెట్టుబడి పెట్టండి జీవితాలను రక్షించండి”. క్షయ బారిన పడిన వ్యక్తులు, క్షయవ్యాధి కారణంగా బాధలు మరియు మరణాలను తగ్గించడానికి చేయడానికి వేగవంతమైన చర్యల కోసం పిలుపునిచ్చారు.
“చాలామంది భావిస్తున్నట్లు కేవలం ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని ఏ భాగానికైనా ఈ క్షయ వ్యాధి రావచ్చు. ఎముకలు, లింఫ్ గ్రంధులు, మెదడు పొరలు, మూత్రపిండాలు, పేగు వ్యవస్థకూ ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అయితే ఈ జబ్బు ఎక్కువగా ఊపితిత్తులనే టార్గెట్ చేస్తుంది. నాలుగు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా దగ్గు, విపరీతమైన దగ్గుతో పాటు కఫం రావడం, సాయంత్రం, రాత్రి వేళల్లో జ్వరం, ఒక్కసారిగా బరువు తగ్గడం, ఆకలి అసలు లేకపోవడం లక్షణాలుగా చెప్పవచ్చు.” అని విజయవాడలోని కామినేని హాస్పిటల్స్ సీనియర్ పల్మోనాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు
క్షయ అనేది గాలిలో వ్యాపించే వ్యాధి, క్షయ ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేదా నవ్వినప్పుడు టిబి బ్యాక్టీరియాను ఇతరులు పీల్చినప్పుడు వారికి వ్యాపిస్తుంది. ఇది ఎవరికైనా సంక్రమించవచ్చు కానీ వ్యాధికి గురయ్యే వ్యక్తులలో ముఖ్యంగా డయాబెటిస్ మెల్లిటస్, హెచ్ఐవి వంటి రోగనిరోధక శక్తి తగ్గినవారిలో లేదా ఏదైనా రకమైన శారీరక లేదా మానసిక ఒత్తిడి ఉన్నవారిలో మాత్రమే ఈ వ్యాధి ప్రభావ ఎక్కువగా ఉంటుంది.
పూర్తిగా తగ్గకమునుపే మందులు మానివేయటం లేదా అడపాదడపా మందులు వేసుకుకొంటూ ఉండటం వల్ల టి.బి. కారక బాక్టీరియా మందులను తట్టుకోగల శక్తిని పెంచుకుంటుంది. దాంతో రోగిలో వ్యాధి ముదిరి మందులకు లొంగనిదిగా తయారవుతుంది. ఇటువంటి రోగుల నుంచి డ్రగ్ రెసిస్టెంట్ టి.బి. వ్యాపిస్తుంటుంది.
“గత 2 సంవత్సరాలుగా కొనసాగుతున్న కోవిడ్-19 సంక్షోభం కారణంగా, ఆరోగ్య సంరక్షణ సేవలకు అంతరాయాలు టిబి, దాని చికిత్సలను నిర్ధారించడంలో ఆటంకం ఏర్పడింది. కోవిడ్ 19 మహమ్మారి గత దశాబ్దంలో టిబికి వ్యతిరేకంగా పోరాటంలో జరిగిన పురోగతిని తిప్పికొట్టింది” అని డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు.
సిహెచ్
Publish Date: Thu, 24 Mar 2022 (16:08 IST)
Updated Date: Thu, 24 Mar 2022 (16:15 IST)