Publish Date: Sat, 18 Oct 2008 (12:29 IST)
Updated Date: Sat, 18 Oct 2008 (12:28 IST)
బౌద్ధమత సంస్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఈయనను సిద్ధార్థుడు, గౌతముడు, శాక్యముని అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈయన శాక్య వంశానికి చెందిన క్షత్రియ రాజు. బౌద్ధులందరిచేత మహాబుద్ధుడిగా కీర్తింపబడిన ఈయన క్రీస్తు పూర్వం 576 నుండి 480 మధ్యకాలంలో జీవించారు.
గౌతమ బుద్ధుడి జీవితంలో జరిగిన సంఘటనలు, బోధలు మరియు భిక్షువుల నడవడికలు మొదలైనవన్నీ ఆయన మరణం తరువాత సంఘంచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట నోటి మాటగా బోధింపబడినా... వాటిని దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత "త్రిపీటకము" అనే పేరుతో మూడు పీఠికలుగా విభజించి భద్రపరిచారు.
"ఈ ప్రపంచం మొత్తం దుఃఖంతో నిండి ఉందని, దుఃఖానికి కారణం అలవిమాలిన కోరికలని, ఆ కోరికలను జయించినట్లైతే... దుఃఖాన్ని జయించిన వారవుతారని" బుద్ధుడు తన ధర్మ సూత్రాల్లో ప్రవచించారు. అంతేగాకుండా, పాపపు పనులు చేయవద్దని, ఎల్లప్పుడూ మంచిపనులనే చేయాలని, దురాలోచనలు చేయవద్దని, మనసును సక్రమంగా ఉంచుకోవాలని ఆయన బోధించాడు.