యుక్తవయసులోనున్న అమ్మాయో, అబ్బాయో చిత్రంగా ప్రవర్తించడం మొదలు పెట్టారంటే వారు ప్రేమలో పడ్డట్టే. మరి ఉద్యోగం చేస్తున్న వారు అప్పటి వరకు ప్రవర్తించిన దానికి పూర్తి భిన్నంగా, చిత్రంగా ప్రవర్తించడం, డబ్బులను మంచినీళ్లలా ఖర్చు చేసేవారు కాస్తా పొదుపరులుగా మారిపోవడంతో ఖర్చు అంటేనే భయపడటం, నిద్రలేని రాత్రులు గడపడం, కలవరించడం వంటివి చేస్తున్నారంటే అది ఆర్థిక మాంద్యం ప్రభావమేనన్నమాట!
అమెరికాలో పెల్లుబికిన ఆర్థిక మాంద్యం దెబ్బతో ఇక్కడి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఒక్క ఐటీ రంగంపైనే కాకుండా ఇతర రంగాలపై సైతం మాంద్యం ప్రభావం గణనీయంగానే పడింది. మీడియా రంగంపై సైతం ఊహించని విధంగా మాంద్యం ప్రభావం పడిందని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు.
అనేక ఐటి కంపెనీల్లో పొదుపు ఉద్యమం సాగుతోంది. చివరకు కొన్నిఐటీ కంపెనీలు బాత్రూంలలో ఉపయోగించే పేపర్ సౌకర్యాన్ని సైతం రద్దు చేశారు. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి వల్ల ఐటీ ఉద్యోగుల్లో మానసిక సమస్యలు చోటు చేసుకుంటున్నాయని, ఇలాంటి ఉద్యోగులు తమ వద్దకు చికిత్సకోసం తరలి వస్తున్నారంటున్నారు వైద్యులు. మాంద్యం దెబ్బతో గతంలో కుదిరిన పెళ్లి సంబంధాలు సైతం రద్దవుతున్నాయి.
ఏయే ఖర్చులకు కోత విధించి పొదుపు పాటించవచ్చునో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు జాబితాను సైతం పంపించారు. ఆమెరికా మాంద్యం ప్రభావం మన దేశంపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి కటించారు. మాంద్యం ప్రభావం ఒక్క ఐటి రంగంపైనే కాకుండా దేశంలోని రత్నాల పరిశ్రమ, జౌళి పరిశ్రమ, నగల పరిశ్రమ తదితర రంగాలపైకూడా తీవ్రమైన ప్రభావం పడింది.
ఐటీ రంగాలకు చెందిన పలు కంపెనీలు గతంలో ఉద్యోగులను ఇంటి నుంచి కారులో తీసుకువెళ్ళి మళ్ళీ కారులో ఇంటివద్ద దింపేవారు. ఐటి బూమ్ కారణంగా హైదరాబాద్, తదితర పెద్దపెద్ద పట్టణాలలో పెద్ద సంఖ్యలో ట్యాక్సీలు వచ్చాయి. ఐటీ ఆదాయం తగ్గడంతో పాటు ఈ ట్యాక్సీల వారు సైతం సంక్షోభంలో పడిపోయారు.