తాత్పర్యం: మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం.
భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి. ఆమెను పై మంత్రముతో వరలక్ష్మి వ్రతమునాడు స్తుతించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం.
అష్టలక్ష్మి దేవీలలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందని పురోహితులు అంటున్నారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయని వారు చెబుతున్నారు.
సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు.
లక్ష్మిదేవిని కొలిచే పద్ధతులు చాలా ఉన్నా.. వరలక్ష్మిదేవి పూజ జగదానందకరమైందని భక్తుల విశ్వాసం. అందుచేత సకల శుభకరమైన, మంగళదాయకమైన వరలక్ష్మి పూజను పాటించే వారికి సర్వమంగళములు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.