Publish Date: Sun, 03 Jun 2007 (18:15 IST)
Updated Date: Thu, 24 May 2007 (15:39 IST)
భక్త రామదాసుగా సుప్రసిద్ధమైన కంచెర్ల గోపన్న తెలుగునాట జన్మించిన భక్త మహాశయులతో మహనీయుడు. ఆయన అచంచల రామ భక్తి జగత్ విఖ్యాతం. నేలకొండపల్లి గ్రామంలో అతి పేద కుటుంబంలో జన్మించి, చిన్నతనంలోనే తల్లిదండ్రులకు పోగొట్టుకున్న గోపన్న మేనమామలైన అక్కన మాదన్నల వద్ద పెరిగి పెద్దవాడయ్యాడు.
ఆనాడు గోల్కొండను ఏలిన తానీషా వద్ద మంత్రులుగా వుండిన అక్కన మాదన్నల సాయంతో గోపన్న గోదావరి తీరంలోని భద్రాచలం పరగణాల తహసీల్దారుగా నియమితుడయ్యాడు. మహా రామభక్తుడైన గోపన్న పన్నుల రూపంలో వసూలు చేసిన ఆరులక్షల వరహాలను వెచ్చించి భద్రాచలంలో శ్రీరామునికి ఆలయం నిర్మించి, నవరత్న ఖచిత ఆభరణాలెన్నో చేయించాడు.
ఈ విషయం తెలిసిన తానీషా గోపన్నకు 12 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించాడు. కారాగారంలో బందీ అయిన గోపన్న శ్రీరాముని భజిస్తూ, ప్రార్ధిస్తూ, స్తుతిస్తూ దెప్పుతూ, బెదిరిస్తూ, నిష్టూరమాడుతూ రోజుకొక కీర్తన చొప్పున కొన్ని వేల కీర్తనలు రచించాడు. గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై వచ్చి తానీషాకు గోపన్న చెల్లించవలసిన ఆరులక్షల వరహాలు చెల్లించి గోపన్నను బంధ విముక్తుడిని చేశాడు. నాటి నుండి గోపన్న భక్త రామదాసుగా ప్రసిద్ధుడైనాడు. కారాగారవాసంలో రామదాసు రచించిన కీర్తనలే భద్రాచల రామదాసు కీర్తనలుగా ఖ్యాతి గడించాయి.
'తారక మంత్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా..'
అంటూ రామదాసు తారక మంత్రాన్ని జపించడమే తన జపం, తపం, యజ్ఞం, సర్వంగా భావించాడు. తనకు తెలిసిన మార్గం అదొక్కటే అన్నాడు రామదాసు.
ఇక్ష్యాకు కుల తిలక
యికనైనా పలుకవే రామచంద్రా
నన్ను రక్షింపకున్నను
రక్షకు లెవరింక రామచంద్రా
అంటూ తన అచంచల రామభక్తిని ప్రదర్శించాడు రామదాసు. అతనికి తెలిసిందల్లా రాముడే! కష్టం వచ్చినపుడు ఆయనకు రాముడే గుర్తుకు వస్తాడు. రాముడు తనను రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు అని ప్రశ్నిస్తాడు.