Publish Date: Mon, 11 Aug 2008 (17:08 IST)
Updated Date: Mon, 11 Aug 2008 (17:07 IST)
కావలసిన పదార్థాలు :
మైదా... పావుకేజీ
నూనె... పావు కేజీ
ఆలుగడ్డలు... అరకేజీ
పచ్చిమిర్చి... 10
గరంమసాలా... తగినంత
పుదీనా... రెండు కట్టలు
ఉల్లిగడ్డలు... రెండు
పుల్లదానిమ్మ గింజలు... కొద్దిగా
తయారీ విధానం :
మైదాను జల్లించుకుని రెండు టీస్పూన్ల నూనె వేసి కొద్దిగా ఉప్పు వేసి, గట్టిగా పూరీల పిండిలాగా తడుపుకుని ఉంచుకోవాలి. తరువాత ఆలుగడ్డలు ఉడకేసి తరిగి ఉంచుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కూడా సన్నగా తరుగుకోవాలి. రెండు కట్టల పుదీనాను కడిగి సన్నగా తరగాలి.
పొయ్యిమీద కళాయి పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేసి కొద్దిగా పోపుగింజలు వేసి వేగిన తరువాత ఉల్లి, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేగనిచ్చి... అలుగడ్డ ముక్కలు, పుదీనా ఆకు, ఉప్పు, కొద్దిగా పసుపు, దానిమ్మ గింజలు, గరంమసాలా పొడి వేసి బాగా కలిపి దించుకోవాలి.
తడిపి ఉంచుకున్న మైదాను పెద్ద గోళీకాయలంత తీసుకొని పూరీని చేసుకుని, ఆ పూరీని చేతిలోనికి తీసుకొని దానిలో ఆలుగడ్డ కూరపెట్టి పొట్లాన్ని మడిచినట్లుగా మడవాలి. మొత్తం పిండినంతటినీ అలాగే చేయాలి. తరువాత పొయ్యిమీద కళాయి పెట్టి నూనె పోసి మరిగిన తరువాత సమోసాలను వేసి, బాగా వేయించి తీసేయాలి. ఇవి వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.