Publish Date: Wed, 09 Jan 2019 (10:21 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (10:34 IST)
‘అన్న వస్తున్నాడు.. మంచి రోజులొస్తున్నాయి’ అంటూ వైకాపా కార్యకర్తల నినాదాల హోరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల మీదుగా పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్ర 2017 నవంబరు 6న ప్రారంభించారు. పాదయాత్ర ప్రారంభించిన ఆయన జిల్లా కేంద్రాల నుంచి మారుమూల పల్లెల వరకూ సాగించారు. అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా చూశారు. వారు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారు. వచ్చేది మన ప్రభుత్వమేననీ, నేను ముఖ్యమంత్రినయ్యాక అన్ని సమస్యలు తీరుస్తానని భరోసా ఇచ్చారు.
కాగా ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు నెలల వ్యవధి వుంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 341 రోజుల పాటు 3,648 కి.మీ మేర జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సాగింది. ఆయన పాదయాత్ర చేస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మరి ఈ స్పందన ఓట్ల రూపంలో జగన్ మోహన్ రెడ్డికి ఏ మేరకు లబ్ది చేకూరుతుందన్నది వేచి చూడాలి.
మరోవైపు జగన్ పాదయాత్ర ముగింపు సభను ఈ రోజు ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇచ్ఛాపురానికి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో పాదయాత్ర విజయ స్తూపాన్ని ఆయన ఆవిష్కరించిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. చూడండి వైఎస్ జగన్ పాదయాత్ర ముగించే ప్రదేశంలో పైలాన్.. ఏరియల్ వ్యూ...