Rally For Rivers... మద్దుతు తెలుపుదాం... 80009 80009 ఒక్క మిస్డ్ కాల్(video)
సద్గురు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన దేశంలో నానాటికి అడుగంటిపోతున్న నదీ జలాలను రక్షించుకునేందుకు జాతీస్థాయి అవగాహన ఉద్యమం ప్రారంభించారు. ''ఇదేమీ నిరసన కాదు, ఆందోళన అంతకంటే కాదు. ఇది కేవలం మన నదులలో
Publish Date: Wed, 16 Aug 2017 (22:49 IST)
Updated Date: Wed, 16 Aug 2017 (22:57 IST)
సద్గురు, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మన దేశంలో నానాటికి అడుగంటిపోతున్న నదీ జలాలను రక్షించుకునేందుకు జాతీస్థాయి అవగాహన ఉద్యమం ప్రారంభించారు. ''ఇదేమీ నిరసన కాదు, ఆందోళన అంతకంటే కాదు. ఇది కేవలం మన నదులలో నానాటికీ క్షీణించిపోతున్న నీటిని ఎలా కాపాడుకోవాలో తెలిపే అవగాహన కార్యక్రమం. నీటిని తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో తప్పకుండా పాల్గొనాలి" అని పిలుపునిస్తున్నారు ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, నదీ జలాల క్షీణతపై అవగాహన కల్గించి కాపాడుకునే మార్గాలను సూచిస్తున్న సద్గురు. ఈ అవగాహన ఉద్యమం కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకూ దేశంలోని 16 రాష్ట్రాల మీదుగా సెప్టెంబరు నెలలో సాగనుంది.
ప్రకృతి సంపద, అడవుల క్షీణత నేపధ్యంలో తమ సామాజిక బాధ్యతగా 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమంలో తాము పాల్గొంటామని సమ్మతిని తెలిపారు. ఈ ర్యాలీని కేంద్ర పర్యావరణ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్థన్ సెప్టెంబరు 3న కోయంబత్తూరులో ప్రారంభిస్తారు. అనంతరం అక్టోబరు 2న ఢిల్లీలో రాజకీయ, వ్యాపార, సినిమా మరియు క్రీడాకారులు అంతా ఈ ర్యాలీకి తమ మద్దతును తెలుపుతూ ఇందులో పాల్గొంటారు.
సద్గురు ట్వీట్ చేస్తూ... " నీటిని తీసుకునే ప్రతి ఒక్కరూ #RallyForRivers ఉద్యమంలో పాల్గొనాలి. ఇది జరిగేలా చేద్దాం" అని పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి సమస్య ఎంత తీవ్రమైనదో అర్థమవుతుంది. మన నదులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశంలో చాలా నదులు వాతావరణ పరిస్థితులను అనుసరించి ప్రవహిస్తుంటాయి. ఇప్పటికే చిన్నచిన్న నదులు ఎన్నో మాయమయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే 15 ఏళ్లలో పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయే ప్రమాదం వుంది. 50 శాతం మేర నీటి లభ్యత పడిపోయే ప్రమాదం వుంది.
ఇషా ఫౌండేషన్తో కలిసి మధ్యప్రదేశ్ ప్రభుత్వం నర్మద నదీ జలాలను మరింత వృద్ధి కోసం సామూహిక చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. వీటితో పాటు ఇంకా మరిన్ని చర్యల ద్వారా నదుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యల పైన దృష్టి పెట్టింది. జూలై1, 2017న మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదిరిన అవగాహన ప్రకారం గోదావరి నది కోసం 50 కోట్ల మొక్కలను నాటాలని నిశ్చయించుకున్నారు. ఇంకా నదులను ఏవిధంగా కాపాడాలన్న దానిపై నిపుణుల కమిటీ ఓ పాలసీ డాక్యుమెంటును సిద్ధం చేశారు.
ఈ డ్రాఫ్ట్ ప్రకారం నదులకు ఇరువైపులా కనీసం అర కిలోమీటర మేర చెట్లు నాటాలని సూచన చేశారు. ప్రభుత్వ భూములు, ఇంకా వ్యవసాయ భూములలోనూ ఈ చెట్లను నాటాలని నిర్ణయించారు. ఇలా చేయడం ద్వారా నదుల తీర ప్రాంతాలు తేమగానూ, బెట్ట లేకుండా వరదల్లో మట్టి కొట్టుకుపోయి మేటలు వేయడం వంటివి లేకుండా ఉంటుంది. ఈ ఉద్యమంలో కోట్లమంది పాల్గొనేవిధంగా (8000980009) ఫోన్ నెంబరుకు ఓ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తమ మద్దతును తెలియజేయవచ్చు.
అలాగే జాతీయ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమంలో యువత, పంచాయతీ మెంబర్లు, ఇషా ఫౌండేషన్ వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా 21 మేజర్ ఈవెంట్లతో పాటు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు వుంటాయి. అలాగే శేఖర్ కపూర్, రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా, ప్రహ్లాద్ కక్కర్ సహకారంతో ర్యాలీ ఫర్ రివర్స్ పైన ఓ లఘు చిత్రం కాంపిటీషన్ నిర్వహించనున్నారు. షార్ట్ వీడియోలను కూడా ఆహ్వానిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 1,00,000 పాఠశాలలు ఇందుకు సంబంధించిన చిత్ర కళ కాంపిటీషన్లలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ పాఠశాలల్లో సద్గురు, వీరేంద్ర సెహ్వాగ్ల నదీస్తుతిని బాలబాలికల చేత ఓ ప్రతిజ్ఞలా చేయిస్తారు. ర్యాలీ ఫర్ రివర్స్ ఉద్యమానికి దేశ వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. ఈ ఉద్యమానికి బీఎస్ఎఫ్, ఇఫ్కో, ఐఆర్సిటిసి, కర్నాటక బ్యాంక్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వరల్డ్ ఆక్వా ఫౌండేషన్, మైక్రో ఫైనాన్స్ అసోసియేన్స్, ఇండిగో ఎయిర్ లైన్స్, డావ్ స్కూల్స్, స్పిక్ మేకే, ఎడ్యుకాంప్ సొల్యూషన్స్ తదితర 30 కార్పొరేట్ కంపెనీలు పాల్గొంటున్నాయి
ఇంకా ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ఆధ్యాత్మికవేత్తలు, బాలీవుడ్, కన్నడ, తెలుగు, తమిళ నటీనటులు, క్రికెటర్లు, కార్పొరేట్ అధిపతులు అంతా ర్యాలీ ఫర్ రివర్స్కు తమ మద్దతును ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. నటి జుహిచావ్లా ట్వీట్ చేస్తూ 80009- 80009 మిస్డ్ కాల్ చేయడం ద్వారా మద్దతు తెలియజేయాలని కోరారు. ఇంకా అనుపమ్ ఖేర్, రిషీ కపూర్, మధు, దియా మీర్జా, మనోజ్ బాజ్ పాయ్ తదిర నటీనటులు తమ మద్దతును తెలియజేశారు.
మలయాళం సూపర్ స్టార్ సద్గురు వీడియోను షేర్ చేయడమే కాకుండా ర్యాలీ ఫర్ రివర్స్ ఆవశ్యకతను బాలబాలికలకు వివరించారు. 8000980009 కి మిస్డ్ కాల్ ఇచ్చి మీ మద్దతును #RallyForRivers తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా కన్నడ నటులు పునీత్ రాజ్ కుమార్, గణేష్, తమిళ నటులు వివేక్, సుహాసిని, రాధిక, ప్రదీపన్ తదితరులు మద్దతు పలికారు. సద్గురు ద్వారా ఓ బృహత్తర కార్యక్రమం జరుగుతోందని బయోకన్ సీఎండి కిరణ్ మజుందార్ ట్వీట్ చేశారు. ఈ ఉద్యమానికి తెలుగు రాష్ట్రాల నుంచి అనూహ్య మద్దతు వస్తోంది. ఇప్పటికే పలు పాఠశాలల్లో బాలబాలికలు తమ తల్లిదండ్రుల వద్ద 8000980009కి మిస్డ్ కాల్ చేసి మద్దతు తెలియజేయాలని చెపుతున్నారు. #RallyForRivers ఉద్యమం విజయవంతమై మన దేశంలోని నదులన్నీ జలసిరితో కళకళలాడాలని ఆశిద్దాం.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories....
Read More