జీఎస్టీ చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం... ఈత గింజంత తాయిలం... తాటికాయంత బాదుడు
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు కీలక చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. కేంద్ర జీఎస్టీ చట్టం-2017, సమీకృత జీఎస్టీ చట్టం-2017, జిఎస్టి (రాష్ర్టాలకు పరిహారం) చట్టం-2017,
వస్తు సేవల పన్ను (జీఎస్టీ)కు సంబంధించిన నాలుగు కీలక చట్టాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. కేంద్ర జీఎస్టీ చట్టం-2017, సమీకృత జీఎస్టీ చట్టం-2017, జిఎస్టి (రాష్ర్టాలకు పరిహారం) చట్టం-2017, కేంద్ర పాలిత జీఎస్టీ చట్టం-2017లకు రాష్ట్రపతి గురువారం ఆమోదముద్ర వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో వచ్చే జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఒకే పన్ను వ్యవస్థను అమలు చేయడానికి మార్గం సుగమమైంది.
ఫలితంగా జూలై ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టం అమల్లోకి రానుంది. ఈ కారణంగా పన్నుల భారం భారీగా పెరిగనుంది. "ఈత గింజ తాయిలంగా ఇచ్చి తాటికాయ తీసుకున్నట్టు" చందంగా కొద్ది వస్తువులపై పన్నుల భారం తగ్గించి, వీలైనన్ని ఎక్కువ వస్తువులపై ఏదో ఒక రూపంలో ప్రభుత్వం పన్నుల రూపంలో పిండుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.
దీంతో సినిమా టిక్కెట్లు, హోటల్ బిల్లు, టెలిఫోన్ బిల్లులు, కేబుల్ టీవీ బిల్లు, బీమా పాలసీలపై ప్రీమియం చెల్లింపు, బ్యూటీపార్లర్, ఎటిఎం, డెబిట్, క్రెడిట్ కార్డులపై చెల్లింపులు, కొరియర్ సేవలు, లాండ్రీ సర్వీసులతో సహా దాదాపు 100 రకాల నిత్య వినియోగ సేవలు మరింత భారం కాబోతున్నాయి. సర్వీస్ టాక్స్పై కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా వెల్లడించిన విషయాలే ఇందుకు ఉదాహరణ.
ప్రస్తుతం 15 శాతంగా ఉన్న సర్వీస్ టాక్స్ను జిఎస్టి హయాంలో 18 శాతానికి పెంచే యోచన ఉందని అధియా వెల్లడించారు. వచ్చే నెల 18-19 తేదీల్లో శ్రీనగర్లో జరిగే సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటిలానే హెల్త్కేర్, విద్య, వ్యవసాయం వంటి రంగాలకు సంబంధించిన కొన్ని సేవలకు మాత్రం ఇప్పటిలానే పన్ను మినహాయింపు కొనసాగే అవకాశం ఉందన్నారు.