Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొదట 21 రోజులు.. ఇపుడు 19 రోజుల లాక్‌డౌన్.. 'మండల దీక్ష' అస్త్రంతో మోడీ వ్యూహం

మొదట 21 రోజులు.. ఇపుడు 19 రోజుల లాక్‌డౌన్.. 'మండల దీక్ష' అస్త్రంతో మోడీ వ్యూహం
, మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (11:44 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోమారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మరో 19 రోజుల పాటు పొడగిస్తున్నట్టు ప్రకటించారు. అంటే.. మే 3వ తేదీ వరకు ఈ లాక్‌డౌన్ అమల్లోవుంటుందని ఆయన మంగళవారం ఉదయం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 
 
దేశంలో తొలి కరోనా కేసు నమోదైన వెంటనే అప్రమత్తమైన కేంద్రం.. ఆ తర్వాత ముందుచూపుతో అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ఇందులోభాగంగానే లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చింది. ఫలితంగానే ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశం ఎంతో సురక్షితంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు.. వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేసులు పెరిగాయి. ఈ కేసుల సంఖ్య రోజుకు 7 నుంచి 8 శాతం మేరకు పెరుగుతూ, ప్రస్తుతం 10 వేలకు పైగా నమోదయ్యాయి. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన వేళ, లాక్ డౌన్ పొడిగించాలన్న వినతులు వచ్చాయి. దీంతో ఆయన సైతం కరోనా కట్టడికి నిబంధనల కొనసాగింపే మంచిదన్న ఉద్దేశానికి వచ్చారు.
 
ఇక అటు రెండు వారాలు కాకుండా, ఇటు మూడు వారాలు కాకుండా, మధ్యలో 19 రోజులు లాక్ డౌన్ కొనసాగుతుందని మోడీ ప్రకటించడం వెనుక, ఆయన చాలా పెద్ద ఆలోచనే చేశారని భావించవచ్చు. 21కి 19 కలిపితే 40 వస్తుంది. అంటే 'మండలం'... భారతదేశంలో మండల దీక్షకు ఎంతో విలువ ఉంది. 
 
ప్రతియేటా కోట్లాది మంది అయ్యప్ప భక్తులు మండల దీక్ష పాటించి, యాత్ర చేస్తుంటారు. జైనులు కూడా మండల దీక్ష చేస్తుంటారు. వివిధ రాష్ట్రాల్లో భక్తి కార్యక్రమాలు మండలం రోజులు కొనసాగుతుంటాయి. ఈ నేపథ్యంలో మండలం రోజుల లాక్‌డౌన్, ప్రజల్లో నిబంధనల సెంటిమెంట్‌ను నిలిపివుంచుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
 
కరోనా కట్టడి కావాలంటే, మండల దీక్షను భారత ప్రజలతో చేయించాలన్న ఉద్దేశంతోనే, లాక్‌డౌన్ పొడిగింపును 19 రోజులుగా మోడీ నిర్ణయించారని భావిస్తున్నారు. ఆ కారణంతోనే మండల దీక్ష సెంటిమెంట్‌ను మోడీ ప్రయోగించారని ఆధ్యాత్మిక గురువులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"వుయ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా" - లాక్‌డౌన్ పొడగింపు : ప్రధాని మోడీ