Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'జేఎన్‌యు రత్నం' నిర్మలా సీతారామన్.. పరకాలతో ప్రేమ ఎలా చిగురించిందంటే...

దేశ రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు. నరసాపురానికి చెందిన పరకాల ప్రభాకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి.

'జేఎన్‌యు రత్నం' నిర్మలా సీతారామన్.. పరకాలతో ప్రేమ ఎలా చిగురించిందంటే...
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (10:17 IST)
దేశ రక్షణ శాఖ మంత్రిగా నియమితులైన నిర్మలా సీతారామన్ తెలుగింటి కోడలు. నరసాపురానికి చెందిన పరకాల ప్రభాకర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమె ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. ఈ వర్శిటీలో ఎంఏలో ఉన్నపుడే ఆమె పరకాలతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారిద్దరూ వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. అయితే, వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందన్న విషయాన్ని పరిశీలిస్తే...
 
తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్ 18 ఆగస్టు 1959లో తమిళనాడులోని మధురైలో జన్మించారు. తండ్రి నారాయణన్‌ సీతారామ్‌ రైల్వే ఉద్యోగి. తల్లి సావిత్రి గృహిణి. తండ్రి నుంచి క్రమశిక్షణ, తల్లి నుంచి పుస్తకపఠనం నిర్మలకు బాగా అబ్బాయి. మదురైలో స్కూలింగ్ పూర్తి చేశారు. 
 
తర్వాత తిరుచ్చిలోని సీతాలక్ష్మి రామస్వామి కాలేజీలో డిగ్రీ (బీఏ) పూర్తి చేశారు. పీజీ కోసం ఢిల్లీ వెళ్లారు. అక్కడ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో ఎంఏ (ఎకనామిక్స్) పూర్తి చేశారు. అక్కడే ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురానికి చెందిన పరకాల ప్రభాకర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 
 
ఆ తర్వాత ఆమె ఇదే వర్శిటీలో జనరల్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ టారీఫ్స్‌ అండ్‌ ట్రేడ్‌ అంశంలో ఎంఫిల్‌, ఆ తర్వాత పీహెచ్‌డీ (ఇండో-యూరోపియన్‌ టెక్స్‌టైల్‌ ట్రేడ్‌  అంశంలో) పట్టాలు పొందారు. అనంతరం వారిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. వారికి ఒక కుమార్తె ఉంది. ప్రభాకర్‌ బీజేపీలో చేరి 2000లో ఆంధ్రప్రదేశ్‌ పార్టీ అధికార ప్రతినిధి అయ్యారు. 
 
కానీ, నిర్మలా సీతారామన్‌ మాత్రం 2006లో అధికారికంగా బీజేపీలో చేరారు. నితిన్‌ గడ్కరీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. అప్పటి నుంచి ఆమె బీజేపీ ప్రముఖుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత మోడీ కేబినెట్‌‌లో సహాయ మంత్రిగా చేరిన ఆమె, ఇప్పుడు కేంద్ర రక్షణ మంత్రిగా ఉన్నారు. 
 
అదీ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత దేశ రక్షణ మంత్రిగా నియమితులైన రెండో మహిళగా గుర్తింపు పొందారు. కానీ పూర్తి స్థాయి రక్షణ మంత్రిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరకొరియా రెచ్చిపోతే అంతే.. చైనాను నమ్మితే నష్టపోయేది?: ట్రంప్