Publish Date: Sat, 02 Nov 2019 (11:21 IST)
Updated Date: Sat, 02 Nov 2019 (11:25 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికే జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో మెగా బ్రదర్, జబర్దస్త్ కామెడీ షో జడ్జి నాగబాబు కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధకరమన్నారు.
కష్టాల్లో ఉన్నవారికి చేయూత అందించేందుకే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్నారన్న ఆయన... పవన్కు సామాజిక స్పృహ ఎక్కువన్నారు. ఓదార్పు యాత్ర చేసిన నేత (సీఎం జగన్)కు భవన నిర్మాణ కార్మికుల బాధలు తెలియవా అంటూ ప్రశ్నించారు.
ఇకపోతే.. పవన్ కళ్యాణ్ లాగా... నాగబాబు కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శలు చేయాలనుకున్నా వైసీపీ ఎమ్మెల్యే రోజా వల్ల కాస్త నెమ్మదిస్తున్నారని టాక్. జబర్దస్త్ కామెడీ షోలో వారిద్దరూ జడ్జిలు కావడంతో వైసీపీని టార్గెట్ చేస్తే రోజాతో సమస్యలు వస్తాయని భావిస్తున్న ఆయన... ఆ వాతావరణాన్ని పాడు చెయ్యడం ఇష్టం లేక... ఒకింత సైలెంటవుతున్నారని సమాచారం.
ఐతే... తాజాగా చేపడుతున్న లాంగ్ మార్చ్ ద్వారా తిరిగి ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు జనసేన ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు, టీడీపీ మద్దతు కూడా సంపాదించడంతో ఈ లాంగ్ మార్చ్ జనసేనకు బాగా కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.