Publish Date: Tue, 02 Nov 2021 (19:01 IST)
Updated Date: Tue, 02 Nov 2021 (19:05 IST)
జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తరువాత రెండవ స్థాయి వ్యక్తి నాదెండ్ల మనోహర్. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉండడమే కాకుండా శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు నాదెండ్ల మనోహర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
అయితే వైసిపిలో చేరకుండా పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో మనోహర్ జనసేనలో ఉన్నారు. ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా పదవి గురించి పట్టించుకోని నాదెండ్ల మనోహర్ వైసిపి, టిడిపిపై తనదైన శైలిలో విమర్సలు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏ సమావేశానికి హాజరైనా కూడా ఆ సమావేశానికి వస్తుంటారు.
ఆయన పక్కనే ఉంటారు. అయితే నాదెండ్ల మనోహర్ కుజనసేనానికి మధ్య ఈ మధ్య గ్యాప్ పెరుగుతోందన్న ప్రచారం ఆ పార్టీలోనే సాగుతోందట. అందుకు కారణం తనకు తెలియకుండా పార్టీలో కొన్ని నిర్ణయాలు మనోహర్ తీసుకోవడం.. బిజెపిని విమర్సించడం వంటివి చేయడం పవన్ కళ్యాణ్కు కోపం తెప్పించాయట
బిజెపితో సన్నిహితంగా కలిసి ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడడం భావ్యం కాదని.. పొత్తుల గురించి.. పార్టీని వదిలేయడం లాంటి విషయాలు ప్రస్తావించడం చేయకూడదన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనట. అయితే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నాదెండ్ల మనోహర్ కొన్ని విషయాలు బయట మాట్లాడడం పవన్కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది.
దీంతో విశాఖ ప్లాంట్ పైన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ చాలాసేపు పవన్ కళ్యాణ్తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం మాట్లాడలేదట. వినీవిన్నట్లు సైలెంట్గా ఆ సభలో ఉండిపోయారట పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ తన తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి కూడా బయటకు పంపించాలన్న నిర్ణయానికి జనసేనాని వచ్చినట్లు తెలుస్తోంది.