Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎమ్మెల్యే రోజా ఫైర్ కాదు, ఫ్లవర్.. ఎవరన్నది?

ఎమ్మెల్యే రోజా ఫైర్ కాదు, ఫ్లవర్.. ఎవరన్నది?
, మంగళవారం, 8 ఫిబ్రవరి 2022 (18:49 IST)
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే అనుకున్నది ఒకటి.. అయినది మరొకటా.. కంట్లో నలుసుగా మారిన పార్టీ నేతపై చర్యలు తీసుకోవాలని రోజా అధిష్టానాన్ని కోరితే అతన్ని పిలిచి కీలక పదవి కట్టబెట్టారా..? ఫైర్ బ్రాండ్ మాట చెల్లుబాటు ఎందుకు కాలేదు...?

 
రోజా.. ఆమె ఫైర్ బ్రాండ్.. ప్రత్యర్ధులను తూటాల్లాంటి మాటలతో ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటారు. కానీ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిపోయారు రోజా. ఆమె అంటే ప్రత్యర్థులకు హడల్. రోజాను ఏమైనా అంటే తోకతొక్కిన త్రాచుపాములా లేస్తారు.

 
ఇదంతా ప్రత్యర్థుల విషయంలో మాత్రమే. కానీ పార్టీలో ఆమెకు ఫైర్ లేకుండా చేస్తున్నారు ప్రత్యర్థులు. రోజాకు సవాల్ విసిరిన వారికి అందలం దక్కుతోంది. దమ్ముంటే నా మీద పోటీ చేసి గెలవమని రోజాకు సవాల్ విసిరిన ఒక మండలస్థాయి నేతకు ఏకంగా శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది వైసిపి హైకమాండ్.

 
ఎమ్మెల్యే రోజాకు సొంత నియోజకవర్గంలో విపక్షాల నుంచి సమస్యలు ఉన్నాయో లేదో గానీ స్వపక్షనేతలు మాత్రం ముప్పతిప్పలు పెడుతున్నారు. నగరిలో వైసిపి మూడునాలుగు ముక్కలైందన్న వాదన వినబడుతోంది. గత రెండు ఎన్నికల్లో రోజాను గెలిపించడానికి కృషి చేసిన వారు ఇప్పుడు ఆమెపై తిరుగుబాటు చేస్తున్నారు. 

 
నియోజకవర్గంలోని ప్రతి మండలంలోను సొంత పార్టీ నుంచే రోజాకు బలమైన ప్రత్యర్థులు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. రెండోసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచి నగరిలో అసమ్మతి బలపడుతూ వస్తోంది. ఎంతలా అంటే  నియోజకవర్గంలోని నిండ్ర మండలానికి చెందిన రెడ్డివారి చక్రపాణిరెడ్డికి శ్రీశైలం ఆలయ ట్రస్టు బోర్డు పదవి దక్కింది.

 
చక్రపాణిరెడ్డి తొలి నుంచి రోజా ప్రత్యర్థి వర్గమే. ఇప్పుడు ఎమ్మెల్యే రోజా ప్రమేయం లేకుండానే ఆయన ప్రతిష్టాత్మక శ్రీశైల ఆలయ ఛైర్మన్ పోస్టును దక్కించుకున్నారంటే పార్టీలో చక్రపాణిరెడ్డికి ఉన్న పట్టును అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి రోజా, చక్రపాణి రెడ్డిల మధ్య అంతర్గతంగా విభేధాలు కొనసాగుతున్నాయనేది చాలామంది చెప్పే మాటే.

 
ఎంపిపి ఎన్నిక విషయంలో రెడ్డివారి చక్రవాణిరెడ్డి ఎంపిడిఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేశారు. రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండుసార్లు ఆమెను గెలిపించినందుకు చెప్పుదెబ్బలు తిన్నట్లు అయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

 
ఈ నేపథ్యంలో ప్రత్యర్థి వర్గంపై మంత్రి పెద్దిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి దృష్టికి అసలు విషయాన్ని రోజా తీసుకెళితే వారిపై చర్యలు తీసుకుని వారిని పార్టీ నుంచి తొలగించాలని కోరితే ఆ విషయాన్ని పక్కనబెట్టి.. అసమ్మతులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడంపై రోజా ఆగ్రహంతో ఉన్నారట. అయితే ఈ విషయంపై రోజాకు మింగుడు పడకుంటే పార్టీ కార్యకర్తలు మాత్రం రోజా ఫైర్ అనుకున్నామే.. కానీ ఫ్లవర్ అని తేలిపోయిందిగా అంటూ చెవులు కొరుక్కుంటున్నారట.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోటి రూపాయల ఇంటి కోసం చూస్తున్న వృద్ధ జనాభా: 70% సీనియర్‌ లివింగ్‌ ప్రాజెక్ట్స్‌ దక్షిణ భారతదేశంలోనే...