International Mother Language Day 2025
భాషా వైవిధ్యాన్ని కాపాడటం, ప్రోత్సహించడం ప్రాముఖ్యతను తెలియజేసేందుకు గాను అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2025 ఫిబ్రవరి 21న జరుపుకుంటారు. అనేక భాషలు అంతరించిపోతున్నందున, ప్రపంచ దేశాలు స్థానిక భాషలను పునరుద్ధరించడం, బహుభాషా విద్యను ప్రోత్సహించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంపై దృష్టి పెట్టాలన్నదే ఈ రోజుటి ప్రధాన లక్ష్యం.
2025 థీమ్: సిల్వర్ జూబ్లీ వేడుక
ఈ సంవత్సరం యునెస్కో ప్రకటించిన ఈ మాతృభాషా దినోత్సవం 25వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. "అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం రజతోత్సవ వేడుక" అనే ట్యాగ్తో భాషా పరిరక్షణలో సాధించిన పురోగతిని ఈ రోజు హైలైట్ చేస్తుంది. అంతరించిపోతున్న భాషలను రక్షించడానికి, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి నిరంతర ప్రపంచ ప్రయత్నాలకు పిలుపునిస్తుంది. విద్య, సామాజిక సమైక్యత, గుర్తింపు నిర్మాణంలో మాతృభాషలు పోషించే కీలక పాత్రను ఇది గుర్తు చేస్తుంది.
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అనే ఆలోచన బంగ్లాదేశ్లో ఫిబ్రవరి 21, 1952న బెంగాలీ భాష గుర్తింపు కోసం జరిగిన పోరాటం నుండి ఉద్భవించింది. ఈ చారిత్రాత్మక సంఘటన మాతృభాషల ముఖ్యమైన ప్రాముఖ్యతను - కమ్యూనికేషన్ మాధ్యమంగా మాత్రమే కాకుండా - సంస్కృతి, సంప్రదాయం, గుర్తింపు రిపోజిటరీగా కూడా నొక్కి చెబుతుంది.
ఈ రోజు యునెస్కో బహుభాషా విద్యను గట్టిగా సమర్థిస్తుంది. ఒకరి మాతృభాషలో నేర్చుకోవడం వల్ల అభివృద్ధి, విద్యా పనితీరు మెరుగుపడుతుందని పేర్కొంది. మాతృభాషలో బోధించే పిల్లలు మెరుగైన పఠన గ్రహణశక్తిని, సామాజిక నైపుణ్యాలను ప్రదర్శిస్తారని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్త అభ్యాస సంక్షోభానికి ప్రతిస్పందనగా, పాఠశాల విద్య తొలినాళ్ల నుండే మాతృభాష ఆధారిత విద్యను అమలు చేయాలని యునెస్కో ప్రభుత్వాలను కోరుతోంది.
భారతదేశంలో భాషా వైవిధ్యం
భారతదేశం భాషా వైవిధ్యానికి నిలయంగా ప్రసిద్ధి చెందింది. భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్ కింద 22 అధికారిక భాషలను గుర్తించింది. దేశవ్యాప్తంగా 1,600 కంటే ఎక్కువ భాషలు, మాండలికాలు మాట్లాడబడుతున్నాయి.
ఈ వైవిధ్యం భారతదేశ గొప్ప సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబిస్తుంది. కానీ సవాళ్లను కూడా అందిస్తుంది. 1971 జనాభా లెక్కల తరువాత, 10,000 కంటే తక్కువ మంది మాట్లాడే భాషలు అధికారిక జాబితాలో చేర్చబడలేదు. గత 50 సంవత్సరాలలో 220 కంటే ఎక్కువ భాషల నష్టానికి దోహదపడిన నిర్ణయం.
మాతృభాషలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ కార్యక్రమాలు
భారత ప్రభుత్వం తన గొప్ప భాషా వారసత్వాన్ని కాపాడుకోవడానికి కట్టుబడి ఉంది. ఎనిమిదవ షెడ్యూల్ను 14 నుండి 22 భాషలకు విస్తరించడం ఈ నిబద్ధతను ప్రదర్శిస్తుంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో కాశ్మీరీ, డోగ్రీ, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్లను అధికారిక భాషలుగా గుర్తించడం వంటి ఇటీవలి కార్యక్రమాలు, సమ్మిళితత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను పునరుద్ఘాటించింది.
11 శాస్త్రీయ భాషలను గుర్తించిన ఏకైక దేశం భారతదేశం, ఈ భాషలను ప్రోత్సహించడానికి అనేక కేంద్ర విశ్వవిద్యాలయాలు, ప్రత్యేక సంస్థలు స్థాపించబడ్డాయి. జాతీయ విద్యా విధానం (NEP) 2020 బహుభాషా విద్య యొక్క ప్రాముఖ్యతను మరింత బలోపేతం చేస్తుంది.