Publish Date: Fri, 27 Mar 2020 (14:10 IST)
Updated Date: Fri, 27 Mar 2020 (14:17 IST)
కరోనా వైరస్. ఇపుడు ఈ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. తమకు రాదులే అని రోడ్లపై స్వేచ్ఛ తిరిగేవారిలో అత్యంత స్వేచ్ఛగా చొచ్చుకుపోతోందీ వైరస్. ఈ వైరస్ ఇంతటి భయంకరమైనదని దేశంలో ఇంకా కొందరికి తెలిసినట్లు లేదు... అందుకే రోడ్లపై గుంపులుగుంపులుగా తిరుగుతున్నారు.
ఈ భయనాక వైరస్ ప్రపంచంలోని కొన్ని దేశాల్లోని ఊళ్లను ఊళ్లకే ఊడ్చేస్తోంది. అక్కడ శవాల దిబ్బలు దర్శనమిస్తున్నాయి. కనీసం దహన సంస్కారాలు చేసేందుకు కూడా వెళ్లేందుకు సాహసం చేయలేని పరిస్థితి నెలకొంటుందంటే, కరోనా వైరస్ ఎంతటి భయంకరమైనదో అర్థం చేసుకోవచ్చు. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5,00,000 మందికి పైగా ప్రాణాల కోసం పోరాడుతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే... కరోనా వైరస్ మన దేశంలో కూడా క్రమంగా విస్తరిస్తోంది. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యంలో విస్తరణ రేటు కాస్తంత మందగించింది. ఐనా దేశంలో చాలామంది లాక్ డౌన్ పాటించకుండా విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మాట వినని ఇలాంటివారిని అదుపులో పెట్టేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఐతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ తన పక్కా ప్రణాళికతో కరోనా వైరస్ ను తొక్కేస్తున్నారనే చెప్పవచ్చు. ఇందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థ ఆయనకు చక్కగా ఉపయోగపడుతోంది. ఊరిలో ఎవరైనా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నారని తెలిస్తే వెంటనే వలంటీర్ ద్వారా సమాచారం అందుతోంది. ఆ వెంటనే సదరు వ్యక్తిని క్వారంటైన్లో వుంచుతున్నారు.
ఇక గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే అతడికి 14 రోజుల క్వారంటైన్ ముద్ర వేసి ఇంట్లో కూర్చోబెడుతున్నారు. ఈ సమయంలో అతడు బయట కనబడితే వెంటనే పోలీసు వాహనం వచ్చేస్తుంది. చేయాల్సింది చేస్తుంది. దీనితో ఎవరైనా బయటకు రావాలంటే జడుసుకుంటున్నారు.
ఐతే నిత్యావసర వస్తువుల కోసం సడలించిన సమయంలో బయటకు వస్తున్న ప్రజలను చూస్తే కాస్త ఆందోళన వ్యక్తమవుతోంది. నగరాలు, పట్టణాల్లో చాలామంది గుంపులుగుంపులుగా తోసుకుంటూ వస్తువుల కోసం ఎగబడుతున్నారు. వీరిలో ఏ ఒక్కరికి కరోనా వైరస్ వున్నా పరిస్థితి ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి కూడా పక్క ప్రణాళిక వేస్తే ఆంధ్రలో అడుగుపెట్టిన కరోనా వైరస్ అక్కడే మలమల మాడి చస్తుంది. ఇదే జరగాలని కోరుకుందాం.