అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మృతి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల సింగపూర్ పర్యటనలో గార్గ్ ఉండగా ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తి స్థాయి దర్యాప్తునకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్గార్గ్ మేనేజర్ సిద్ధార్థశర్మలను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మహంతను అరెస్టు చేయగా గురుగ్రామ్లోని ఓ అపార్ట్మెంట్లో శర్మను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిద్దరినీ గువాహటికి తరలించినట్లు తెలిపారు.
జుబీన్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్ ఇళ్లలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సౌండ్ రికార్డిస్ట్ నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. ఇక ఇప్పటికే ఈ కేసు విషయంలో మ్యుజీషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. జుబీన్ మరణానికి ముందు ప్రయాణించిన నౌకలో ఉన్న బృందంలో గోస్వామి కూడా ఉన్నారని అందుకే అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.