Publish Date: Sun, 12 Sep 2021 (18:12 IST)
Updated Date: Sun, 12 Sep 2021 (18:15 IST)
ఖమ్మం గ్రామీణ మండలం వెంకటగిరిలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడి వేధింపులు తాళలేక ఈ నెల 9న ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పదో తరగతి విద్యార్థిని మృతిచెందింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొన్నాళ్లుగా తనను ప్రేమించాలని బాలికను వేధిస్తున్న యువకుడు ఈ నెల 9న మరోసారి బాలికపై ఒత్తిడి చేశాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించింది.
ఇంటి పక్కల వారు చూసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే బాలికను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక నిన్న రాత్రి మృతిచెందింది. ఘటనపై ఖమ్మం గ్రామీణ పీఎస్లో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువకుడు సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాలిక మృతి చెందడంపై ఖమ్మం ఆస్పత్రి వద్ద బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు.