Publish Date: Wed, 01 Apr 2026 (16:17 IST)
Updated Date: Wed, 01 Apr 2026 (16:23 IST)
కట్టుకున్న భర్తను కాదని.. కన్నబిడ్డల భవిష్యత్ని మరిచి, ప్రియుడితో కలిసి భర్తపై దాడి చేసి చంపిన ఘటన పెను సంచలనం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. పాల్వంచ మండల పరిధిలోని మొండికట్ట గ్రామానికి చెందిన గడికోట ప్రసాద్ (28) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
ప్రసాద్, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు సంతానం. గత కొంత కాలంగా వీరి మధ్య వివాదాలు జరుగుతున్నట్టు సమాచారం. కృష్ణవేణి తన భర్తను వదిలేసి గత ఆరు నెలలుగా హైదరాబాదులోని బోడుప్పల్లో నివాసం వుంటుంది. ఈ క్రమంలోనే కృష్ణవేణి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు.
మార్చి 25న భర్త ప్రసాద్కు ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడింది. హైదరాబాద్ వెళ్లిన తర్వాత తన సుఖానికి భర్త ప్రసాద్ అడ్డుగా వున్నాడని ప్రియుడితో కలిసి ప్రసాద్పై విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ఆరోపించారు.
ఈ దాడిలో ప్రసాద్ కడుపులో పేగులు కమిలిపోయాయి. ఈ ఘటనలో ప్రసాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.