Publish Date: Thu, 21 May 2026 (08:29 IST)
Updated Date: Thu, 21 May 2026 (08:30 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్లో దారుణం జరిగింది. తన పిల్లలను చూసేందుకు వచ్చిన భర్తను కుటుంబ సభ్యులతో కలిసి భార్య కొట్టి చంపేసింది. జిల్లాలోలని యాలాల మండలం హజాపూర్లో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విరలాను పరిశీలిస్తే,
వికారాబాద్ జిల్లా యాలాల మండలం హజీపూర్కు చెందిన గురు వెంకటేశ్(31) మహబూబ్నగర్ జిల్లా మల్కాపూర్కు చెందిన స్వప్న ప్రేమించుకుని 2015లో వివాహం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్లో కాపురం పెట్టగా కుమార్తె, కుమారుడు జన్మించారు. భర్తకు మద్యం అలవాటు ఉండటంతో తరచూ గొడవలయ్యాయి. నాలుగేళ్ల క్రితం కుటుంబ కలహాలతో ఇద్దరూ విడిపోయారు.
అప్పటి నుంచి స్వప్న వనస్థలిపురంలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో 7వ అంతస్తులోని తల్లి, సోదరుని వద్ద ఉంటోంది. భర్త రెండు రోజులుగా తన పిల్లలను చూడాలని వనస్థలిపురానికి వస్తున్నాడు. మంగళవారం రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు కొట్టాడు. ఇంట్లో ఉన్న స్వప్న, సోదరుడు దుబ్బాల పాండు, అతని స్నేహితుడు జగదీశ్ తలుపులు తెరిచారు.
పిల్లలను చూపించాలని కోరగా పాండు, జగదీశ్ అతడి ముఖం, కడుపులో చేతులతో దాడి చేశారు. వెంకటేశ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతన్ని 7వ అంతస్తు నుంచి 3వ అంతస్తుకు మెట్ల మార్గంలో తీసుకువస్తుండగా.. అప్పుడే పైకి వస్తున్న ఓ యువకుడు వీడియో తీశాడు. ముగ్గురు అతన్ని అక్కడే వదిలి పారిపోయారు. తెల్లవారే సరికి అతను మృతిచెందాడు. పోలీసులు స్వప్న, పాండులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జగదీశ్ పరారీలో ఉన్నాడు