Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వృద్దురాలైన భార్య శీలాన్ని శంకించిన భర్త... సుపారీ ఇచ్చిన చంపేసిన భార్య

murder
, గురువారం, 3 ఆగస్టు 2023 (19:40 IST)
ఆరు పదులు దాటిన తర్వాత కూడా తన శీలాన్ని భర్త శంకించడంతో జీర్ణించుకోలేని భార్య అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భర్తను చంపేసింది. అయితే, సుపారీ తీసుకున్న వారు మరో లక్ష రూపాయలు కావాలంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని రాజసన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత నెల 13వ తేదీన జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దిపేట జిల్లా చింతమడక గ్రామానికి చెందిన కనకవ్వ, కాశయ్య దంపతులు పాతికేళ్ల క్రితం సిరిసిల్లకు వలస వెళ్లారు. సిరిసిల్ల మార్కెట్‌లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. 
 
కూతుళ్లకు పెళ్లిళ్లు కాగా కొడుకుకు మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు. అయితే, భార్య కనకవ్వను అనుమానిస్తూ కాశయ్య తరచూ కొడుతుండేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని కనకవ్వ వరుసకు తమ్ముడయ్యే వ్యక్తికి చెప్పుకుని బాధపడింది.
 
భర్త కాశయ్యను చంపేస్తే రూ.2 లక్షలు ఇస్తానని చెప్పింది. దీంతో మరో వ్యక్తితో కలిసి కాశయ్యను చంపేశాడు. జులై 13న ఇంట్లో నిద్రిస్తున్న కాశయ్య గొంతు చుట్టూ దుప్పటి చుట్టి హత్య చేశారు. నిందితులలో ఒకరు ఇదంతా వీడియో తీశారు. 
 
మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి మానేరు వాగు చెక్ డ్యామ్ వద్ద బొందలగడ్డలో పూడ్చిపెట్టారు. కనకవ్వ ఇచ్చిన రూ.2 లక్షలు తీసుకుని వెళ్లి జల్సాలు చేశారు. డబ్బు మొత్తం ఖర్చవగానే తిరిగి వచ్చి కనకవ్వను బ్లాక్ మెయిల్ చేయసాగారు.
 
మరో లక్ష రూపాయలు ఇవ్వకుంటే వీడియో బయటపెడతామని బెదిరించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరడంతో కనకవ్వను, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో కాశయ్య హత్య విషయం బయటపడింది. తహసీల్దార్ సమక్షంలో బొందలగడ్డలో నుంచి కాశయ్య మృతదేహాన్ని వెలికి తీసి, పోస్టుమార్టం కోసం పంపించినట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలపై స్టే.. సర్కారుకు చెంపదెబ్బ వంటిది : టీడీపీ నేత గంటా