Publish Date: Sun, 10 May 2026 (09:56 IST)
Updated Date: Sun, 10 May 2026 (09:57 IST)
తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థి ఒకరు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు పొద్దస్తమానం మొబైల్ ఫోన్ చూడొద్దన్నందుకు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుర్రాలచెరువుకు చెందిన సంకుల పవన్ కుమార్(20) హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చినప్పటి నుంచి పొద్దస్తమానం సెల్ఫోన్ చూస్తుండటాన్ని గమనించిన తండ్రి రాజు ఇలా అయితే ఎలా అని సున్నితంగానే మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన పవన్ కుమార్ గురువారం రాత్రి గుర్తుతెలియని పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కుటుంబీకులు పవన్ను హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించారు. శనివారం పవన్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.