కొందరు చిన్నారుల్లో నేరప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతోంది. వారు చేసే పనుల వల్ల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. అలాగే, ఆ చిన్నారులు కూడా తమ భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ బాలుడు చేసిన పనికి అతనితోపాటు అతని తల్లిదండ్రులు కూడా చిక్కుల్లో పడ్డారు. ఒక వృద్ధురాలి మెడకు చీర బిగించి హత్య చేసిన బాలుడు... ఆ తర్వాత మృతదేహంపై నృత్యం చేస్తూ పైశాచికానందం పొందాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
స్థానిక కృష్ణా నగర్ కాలనీలో కమలమ్మ అనే 78 యేళ్ల వృద్ధురాలు ఇటీవల హత్యకు గురైంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కమలమ్మ అనే వృద్ధురాలు ఇంటిలో ఒంటరిగా ఉండేది. ఆమెకు ఉన్న మరో రెండు చిన్నపాటి ఇళ్లను రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాశ్ చౌదరి, లలిత్ చౌదరిలకు అద్దెకు ఇచ్చింది. వీరితో కలిసి రాజస్థాన్కే చెందిన 17 యేళ్ల బాలుడు ఉంటున్నాడు. అయితే, దుకాణం నిర్వహణ విషయంలో బాలుడుని తరచుగా కమలమ్మ మందలించడమే కాకుండా, కంటికి కనిపించినపుడల్లా కసురుకోసాగేది.
తనను ఎపుడూ కోపగించుకోవడంతో ఆ మహిళపై బాలుడు కక్ష పెంచుకున్నాడు. గత శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లోకి చొరబడి ఆమె మెడకు చీరబిగించి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహంపై ఎక్కి తొక్కాడు. డ్యాన్స్ చేశాడు. దీనిని వీడియో తీసి బెంగుళూరులోని తన స్నేహితులకు వాట్సాప్లో షేర్ చేశాడు. వారు మరికొందరికి షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ కావడంతో అది వైరల్ అయింది.
దీనిపై కర్నాటక పోలీసులు ఆరా తీయగా, హైదరాబాద్ నగరంలో జరిగినట్టు గుర్తించి, రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సమాచారం అందించారు. దీంతో ఈ వృద్ధురాలి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. కమలమ్మ మృతదేహం కుళ్లినస్థితిలో కనిపించగా, దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడుని కూడా అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.