భర్త చనిపోయిన స్త్రీ, భర్తతో విడాకులు తీసుకున్న సగటు స్త్రీల బ్రతుకులు మోడులా మారిపోయి కనిపిస్తుంటాయి. భర్త లేని స్త్రీ అంటే చాలా చులకన. భర్త లేని లోటును భర్తీ చేసే మగతోడు దొరికితే, ఆ తోడుతో ఆమె హాయిగా జీవిస్తుంటే జీర్ణించుకోలేని జనం కూడా వుంటారు. ఇలాంటి విషాదకర ఘటన ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన సోనీకి 12 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె వున్నారు. ఐతే ఆరేళ్ల క్రితం సోనీ భర్త జబ్బు చేసి అనారోగ్యంతో మరణించాడు.
ఇక అప్పట్నుంచి సోనీ తన పిల్లల్ని చదివించుకుంటూ జాగ్రత్తగా వుంటోంది. ఈ క్రమంలో ఆమెకి ఏదైనా అత్యవసరమైన పనులు కావాలంటే అదే ప్రాంతానికి చెందిన కైలాష్ అనే వ్యక్తిపైన ఆధారపడేది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. కైలాష్కి కూడా వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. భర్త లేని మహిళ సోనీకి సాయం చేస్తున్న కైలాష్ గురించి అతడి భార్య కూడా లైట్ గా తీసుకున్నది. దీనితో కైలాష్-సోనీ ఇద్దరూ వీలున్నప్పుడల్లా ఏకాంతంగా కలవడం చేస్తున్నారు. సోనీ మరొక వ్యక్తితో సంబంధాన్ని సాగించడాన్ని సోనీ భర్త తరపు వారు జీర్ణించుకోలేకపోయారు.
గత శుక్రవారం నాడు కైలాష్ ను కలిసేందుకు సోనీ ఏకాంతంగా వెళ్తుండగా ఆమెను అనసరించారు. సోనీ-కైలాష్ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇద్దరినీ ఓ స్తంభానికి కట్టేసి ఇద్దరిపై పెట్రోలు పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. మంటల ధాటికి కైలాష్-సోనీ ఆర్తనాదాలు చేస్తుండటంతో స్థానికులు పరుగులు పెడుతూ అక్కడికి వెళ్లారు. వారి కట్లు విప్పారు. కానీ అప్పటికే కైలాష్ 70 శాతం గాయాలు, సోనీ 90 శాతం గాయాలయ్యాయి. ఇద్దరూ చికిత్స పొందుతూ మరణించారు.
వారి మరణానికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. భర్త లేని ఆ మహిళకు ఆసరాగా నిలిచిన ఆ వ్యక్తి భార్యకు లేని బాధ వీళ్లకెందుకు అంటూ పలువురు స్థానికులు వాదనకు సైతం దిగారు. వారికి పోలీసులు సర్దిచెప్పి పంపించేసారు. నిందితులను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.