ఒరిస్సా రాష్ట్రంలోని మయూర్ భంజ్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. మద్యానికి బానిసైన ఓ కుమారుడు వృద్ధ తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాలతో రాత్రంతాగడిపాడు. మరుసటి రోజు ఉదయాన్ని స్థానికులు చూసి షాక్ అయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల కథనం మేరకు..
ధోనాపాల్ గ్రామానికి చెందిన హిమాన్షు (55) ఆటో డ్రైవర్. మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడటంతో భార్యా పిల్లలు చాలా కాలంగా విడిగా ఉంటున్నారు. కాగా, మంగళవారం రాత్రి హిమాన్షు పీకలవరకు మద్యం తాగి ఇంటికి చ్చాడు. వృద్ధ తల్లిదండ్రులైన హదిబంధు సాహు (81), శాంతి సాహు (72)తో గొడవపడ్డాడు. ఆ తర్వాత ఆగ్రహంతో వారిపై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధ దంపతులు అక్కడే చనిపోయారు. మద్యం మత్తు తలకెక్కడంతో ఆ కిరాతక కొడుకు రాత్రంతా మృతదేహాల వద్దనే నిద్రపోయాడు.
తెల్లవారి స్థానికులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని హిమాన్షును అరెస్టు చేశారు. శవపరీక్ష కోసం మృతదేహాలను పీఎంఆర్ వైద్య కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.