సమోసా విషయంలో జరిగిన చిన్నపాటి ఘర్షణ ఆ షావు యజమాని హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాకేశ్ అనే వ్యక్తికి ఫరూక్ నగర్ ప్రాంతంలో టీ స్టాల్ ఉంది. ఈ నెల 12వ తేదీన నిందితుడు పంకజ్ తన అనుచరులతో కలిసి టీ స్టాల్కు వచ్చి సమోసా ఇవ్వాలని కోరాడు. ఈ విషయంపై షాపు యజమానికి పంకజ్కు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ నుంచి వెళ్లిపోయిన పంకజ్.. కొద్దిసేపటికి తన అనుచరులతో కలిసి షాపు వద్దకు చేరుకుని మళ్లీ యజమానితో ఘర్షణపడ్డాడు.
ఈ క్రమంలో షాపు యజమానిపై ఆరుసార్లు కాల్పులు జరిపాడు. ఆ తర్వాత రాకేష్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన స్థానికులు.. ఫరూఖ్ నగర్ - ఝజ్జర్ రహదారిని దిగ్బంధించారు. వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన తెలిపారు. నిందితులను అరెస్టు చేసి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను శాంతపరిచారు. మరోవైపు, పరారీలో ఉన్న నిందితులను 48 గంటల్లో అరెస్టు చేస్తామంటూ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.