చదువుకునేందుకు పాఠశాలలకు వెళ్లే బాలికలకు అక్కడ కూడా రక్షణ లేకుండా పోతోంది. కొందరు కామాంధులు పాఠశాలల్లోనే బాలికపై లైంగికదాడులకు తెగబడుతున్నారు. తాజాగా స్కూల్ మరుగుదొడ్డిలో ఓ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
నిందితుడు పాఠశాల ప్రహరీ దూకి లోపలికి ప్రవేశించి, నేరుగా మరుగుదొడ్డిలోకి వెళ్లి అక్కడ దాక్కున్నాడు. కాసేపటికి బాత్రూంకి వచ్చిన బాలికపై అత్యాచారానికి పాల్పడి, వచ్చిన దారిలోనే గోడ దూకి పారిపోయాడు. భయంతో వణికిపోయిన ఆ చిన్నారి, జరిగిన దారుణాన్ని టీచర్లకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టంతో పాటు అత్యాచారం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు, పాఠశాల గోడ సమీపంలో నివసించే ఓ వ్యక్తిపై అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని స్థానిక పోలీస్ అధికారి తెలిపారు.
కాగా, ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ "రాజధానిలోని పాఠశాలలోనే బాలికలకు రక్షణ లేకపోతే, ఇక ఎక్కడ ఉంటుంది? మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది" అని విమర్శించారు.
ప్రతిపక్ష నేత టికా రామ్ జుల్లీ స్పందిస్తూ "రాజస్థాన్ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఇలాంటి నేరాలు తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఇది బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి, నిర్లక్ష్యానికి నిదర్శనం" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.