ప్రేమించిన వ్యక్తి కోసం లింగ మార్పిడి చేయించుకుంటే, ప్రియుడు మాత్రం ముఖం చాటేశాడు. అంతేకుకండా, పెళ్లి కాకముందే శారీరకంగా వేధించాడంటూ లింగ మార్పిడి చేయించుకున్న 25 యేళ్ల యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిపై అత్యాచారం, వేధింపుల కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైసెన్ జిల్లా ఒబేదుల్లాగంజ్కు చెందిన బాధితురాలు, నర్మదాపురానికి చెందిన నిందింతుడు పదేళ్ల క్రితం కలుసుకున్నారు. ఇద్దరూ స్వలింగ సంపర్కులు కావడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. ఆపై చాలాకాలం పాట సహజీవనం చేశారు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు, లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడి చేసినట్టు బాధితారులు తన ఫిర్యాదులో పేర్కొంది.
పిమ్మట మాట నమ్మి ఇండోర్లోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకుని యువతిగా మారింది. అయితే, సర్జరీ జరిగిన కొన్ని గంటలకే నిందితుడు ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. వివాహ ప్రస్తావన చేయగా ముఖం చాటేసి చివరకు నిరాకరించాడు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు భోపాల్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు క్షుద్రపూజలు కూడా చేస్తాడని, లింగ మార్పిడికి ముందే తనను లైంగికంగా వాడుకున్నాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే, బాధితురాలికి వైద్య పరీక్షలు చేయగా, లింగ మార్పిడి జరిగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.