Publish Date: Tue, 13 Jun 2023 (12:10 IST)
Updated Date: Tue, 13 Jun 2023 (12:34 IST)
పెళ్లయిన వ్యక్తిని ప్రేమించిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. గన్నవరం పట్టణంలోని సినిమాహాళ్ల కూడలి సమీపంలో నివసిస్తున్న మొహమ్మద్ జాస్మిన్(20) బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈమెకు గన్నవరానికే చెందిన ఎస్.కె.జబీబుల్లా అనే 27 ఏళ్ల వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడికి పెళ్లయ్యింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాల క్రమంలో జాస్మిన్, జబీబుల్లాల పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు.. అతడిని పలుమార్లు హెచ్చరించారు. ఇటీవల ఇల్లు మారిన జబీబుల్లా గత రెండ్రోజులుగా జాస్మిన్ ఫోన్ ఎత్తకపోవడం.. ఇతర కారణాలతో విద్యార్థిని మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఫ్యాన్కు ఉరివేసుకుంది.
ఈ విషయం గమనించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన చిన్నఅవుటపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. చేతికందివచ్చిన కుమార్తె మృతికి జబీబుల్లా కారణమంటూ.. కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
తమ కుమార్తెను శారీరకంగా, మానసికంగా వేధింపులకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జబీబుల్లాపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, అతడిని అదుపులోకి తీసుకున్నామని సీఐ కనకారావు తెలిపారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె మృతిచెందడంతో.. తల్లిదండ్రుల రోదన చూపరులను కంటతడి పెట్టించింది.