Publish Date: Tue, 27 Jan 2026 (12:46 IST)
Updated Date: Tue, 27 Jan 2026 (12:47 IST)
కర్నాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. తనతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ఓ వివాహితను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరుకు చెందిన సయ్యద్ మస్తాన్ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఆయనకు ఎనిమిదేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపుర జిల్లా చేళూరుకు చెందిన సల్మా (35)తో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం వారు చేళూరులో నివాసం ఉంటున్నారు. పీటీఎం మండలంలోని నిలువురాతిపల్లెకు చెందిన బాబాజాన్ (35) సైతం కొన్నాళ్లుగా కుటుంబంతో కలిసి చేళూరులోనే ఉంటున్నారు. అక్కడ వివాహిత సల్మాతో సన్నిహితంగా మెలిగేవాడు. వారికి వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలతో ఇరు కుటుంబాల మధ్య ఇటీవల గొడవ తీవ్రమైంది.
ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి. ఆదివారం రాత్రి.. ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో ఇంటికి వెళ్లి, గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం తాను ఉంటున్న ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చేళూరు ఠాణా పోలీసులు వెల్లడించారు.