దేశ రాజధాని ఢిల్లీలో సభ్య సమాజం తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. కామాంధ కుమారుడు ఒకడు కన్నతల్లిపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. తన చిన్నతనంలో తల్లికి ఇతర సంబంధాలు ఉన్నాయనే పగతో, ఆమెపైనే అత్యాచారానికి ఒడిగట్టాడు. పైగా, ఆమెను శిక్షించేందుకే ఈ పైశాచికానికి పాల్పడినట్టు చెప్పడం ఇపుడు కలకలం రేపుతోంది. ఈ ఘోరానికి సంబంధించి 39 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. ఢిల్లీలోని హౌజ్ ఖాజీ ప్రాంతంలో 65 ఏళ్ల బాధితురాలు తన భర్త, నిందితుడైన కొడుకు, 25 ఏళ్ల చిన్న కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. ఇటీవల ఈ కుటుంబం సౌదీ అరేబియాలో పుణ్యక్షేత్రాల పర్యటనకు వెళ్లింది. వారు అక్కడ ఉన్నప్పుడే నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి, వెంటనే తిరిగి రావాలని ఒత్తిడి చేశాడు. అంతేకాకుండా, తన తల్లికి విడాకులు ఇవ్వాలని, చిన్నప్పుడు ఆమెకు అక్రమ సంబంధాలు ఉండేవని ఆరోపించాడు.
ఈ నెల ఒకటో తేదీన కుటుంబం ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే నిందితుడి అరాచకం మొదలైంది. తల్లిని ఓ గదిలో బంధించి, బురఖా తొలగించమని బలవంతం చేసి, ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంతో తీవ్ర ఆవేదనకు గురైన బాధితురాలు సమీపంలోనే ఉండే తన పెద్ద కుమార్తె ఇంట్లో తలదాచుకున్నారు.
అయితే, ఆగస్టు 11న ఆమె తిరిగి సొంత ఇంటికి వచ్చారు. అయినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆగస్టు 14న తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మరోసారి తల్లిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఈసారి కూడా ఆమె పాత సంబంధాలకు శిక్ష విధిస్తున్నానని చెప్పాడు. ఈ దారుణాన్ని ఇక భరించలేని ఆ తల్లి తన గోడును చిన్న కుమార్తె వద్ద వెళ్లబోసుకున్నారు.
ఆమె ఇచ్చిన ధైర్యంతో ఇద్దరూ కలిసి హౌజ్ ఖాజీ పోలీస్ స్టేషనులో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (అత్యాచారం) కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.