Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు ఆటగాళ్ల అద్వితీయ ప్రదర్శన టీమిండియాకు విజయం చేకూర్చేనా?

సహనానికే సహనం నేర్పుతూ ఇద్దరు ఆటగాళ్లు చేసిన అద్వితీయ ప్రదర్శన టెస్టు క్రికెట్‌కు ప్రాణం పోసింది. వరుసగా రెండు సెషన్ల పాటు వికెట్‌ ఇవ్వకుండా వీరిద్దరు సాగించిన సున్నిత విధ్వంసానికి ఆసీస్‌ జట్టు నిర్ఘా

Advertiesment
cheteshwar pujara
సహనానికే సహనం నేర్పుతూ ఇద్దరు ఆటగాళ్లు చేసిన అద్వితీయ ప్రదర్శన టెస్టు క్రికెట్‌కు ప్రాణం పోసింది. వరుసగా రెండు సెషన్ల పాటు వికెట్‌ ఇవ్వకుండా వీరిద్దరు సాగించిన సున్నిత విధ్వంసానికి ఆసీస్‌ జట్టు నిర్ఘాంతపోయింది. ప్రత్యర్థి బౌలర్లు బంతులు విసిరి విసిరి అలసిపోయి ఇక అవుట్‌ చేయడం మా వల్ల కాదన్నట్లుగా చేతులెత్తేసిన వేళ... పుజారా డబుల్‌ సెంచరీతో భారత్‌ను మరో చిరస్మరణీయ విజయం ముంగిట నిలిపాడు. స్కోరు సమం చేస్తే చాలనుకున్న స్థితి నుంచి ఆధిక్యం అలా అలా పెరుగుతూ పోయి మ్యాచ్‌ మన చేతుల్లోకి వచ్చే విధంగా రాచబాట వేశాడు. మరో ఎండ్‌ నుంచి వహ్వా అనిపించేలా ‘బుద్ధి’మాన్‌ సాహా శతకంతో ఇచ్చిన సహకారం కూడా రాంచీ టెస్టును అనూహ్య మలుపు తిప్పింది. 
 
భారత్‌లో తొలి ఇన్నింగ్స్‌ స్కోరే కీలకం, 450 పరుగులు కూడా సరిపోవు అంటూ పదే పదే భయపడిన స్మిత్‌ మాటే ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. సరిగ్గా మూడు నెలల క్రితం ముంబైలో ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిన ఫలితం ఇప్పుడు కంగారూలను కూడా వెంటాడుతున్నట్లుంది. ఆఖరి రోజు స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌కు చిన్నపాటి లక్ష్యం విధించినా గెలుపుపై ఆశ పెంచుకోవచ్చు అని భావించిన ఆస్ట్రేలియాకు సీన్‌ రివర్సయింది. ఇప్పుడు తమ జట్టే అలాంటి పిచ్‌పై ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. జడేజా దెబ్బకు ఇప్పటికే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ రోజంతా నిలబడగల గడం ఆ జట్టు శక్తికి మించిన పని కావచ్చు!  
 
రాంచీ నాలుగో రోజు అనూహ్య మలుపు తిరిగిన మూడో టెస్టులో భారత్‌ విజయంపై కన్నేసింది. ఆస్ట్రేలియాపై తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా, రెండో ఇన్నింగ్స్‌లో అప్పుడే 2 ఆసీస్‌ వికెట్లను పడగొట్టేసింది. మ్యాచ్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 23 పరుగులు చేసింది. వార్నర్‌ (14), లయన్‌ (2) అవుట్‌ కాగా, రెన్‌షా (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నాడు.

అంతకుముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 603 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. చతేశ్వర్‌ పుజారా (525 బంతుల్లో 202; 21 ఫోర్లు) డబుల్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, వృద్ధిమాన్‌ సాహా (233 బంతుల్లో 117; 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ నమోదు చేశాడు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌కు 4 వికెట్లు దక్కగా, 3 వికెట్లు తీసేందుకు ఒకీఫ్‌ ఏకంగా 77 ఓవర్లు బౌలింగ్‌ చేయడం విశేషం.
 
స్పిన్‌కు భీకరంగా స్పందిస్తున్న పిచ్‌పై ఆఖరి రోజు సోమవారం ఆసీస్‌ ముంగిట పెద్ద సవాల్‌ నిలిచింది. చివరి ఇన్నింగ్స్‌ ఆడుతున్నట్లయితే పరుగులతో పని లేకుండా కేవలం ‘డ్రా’ కోసం ప్రయత్నించే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మూడో ఇన్నింగ్స్‌ కావడంతో ఆసీస్‌ ముందుగా భారత్‌ ఆధిక్యాన్ని అధిగమించాల్సి ఉంది. కాబట్టి వికెట్‌ కాపాడుకోవడమే కాకుండా పరుగులు కూడా చేయడం అవసరం. ఆపైన కూడా మరిన్ని పరుగులు చేసి భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేశించడం ఆ జట్టుకు దాదాపు అసాధ్యం కావచ్చు!
 
క్రీజ్‌లో నిలబడ్డ సమయం 672 నిమిషాలు... ఎదుర్కొన్న బంతులు 525... ఓపిక, ఏకాగ్రత, పట్టుదలకు కొత్త పాఠాలు నేర్పిస్తూ చతేశ్వర్‌ పుజారా ప్రదర్శించిన అమూల్యమైన ఆట ఇది. క్రికెట్ ప్రేమికులు మరచిపోని ప్రదర్శన చేసిన పుజారా, సాహాలకు మూడో టెస్టులో విజయం సాధించడమే టీమ్ ఇండియా వారికి ఇవ్వబోయే నజరానా. మరి టీమిండియా మరి కాస్సేపట్లో ప్రారంభం కాబోయే చివరి రోజు మ్యాచ్‌లో ఆసీస్‌ను చాప చుట్టేస్తుందా? చుట్టగలదా?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆసీస్ ఆటగాళ్ల నీతి ఇదేనా... కోహ్లీని వెక్కిరించడంపై వీవీఎస్ ధ్వజం