Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : కోహ్లీ సేన ఆశలు గల్లంతు.. కివీస్‌కు బెర్త్ ఖరారు

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : కోహ్లీ సేన ఆశలు గల్లంతు.. కివీస్‌కు బెర్త్ ఖరారు
, ఆదివారం, 7 నవంబరు 2021 (19:41 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా భారత క్రికెట్ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో సోమవారం భారత క్రికెట్ జట్టు నామమాత్రమైన నమీబియా జట్టుతో తలపడి, స్వదేశానికి బయలుదేరనుంది. 
 
ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు చేరాలంటే, న్యూజిలాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం సాధించాలని, తద్వారా టీమిండియా సెమీస్ ఆశలు సజీవంగా నిలవాలని భావించిన అభిమానులంతా కోరుకున్నారు. కానీ, వారి ఆశలు అడియాశలయ్యాయి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి సంచలనం నమోదు కాలేదు కదా, న్యూజిలాండ్ జట్టు అన్ని రంగాల్లో ఆధిపత్యం కనబరుస్తూ ఆఫ్ఘనిస్థాన్ పై 8 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా గ్రూప్-2 నుంచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్లు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేయగా లక్ష్యఛేదనలో కివీస్ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 125 పరుగులు చేసి విజయభేరి మోగించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 40, డెవాన్ కాన్వే 36 పరుగులతో అజేయంగా నిలిచారు. అంతకుముందు ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 28, డారిల్ మిచెల్ 17 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్ 1, రషీద్ 1 వికెట్ తీశారు.
 
కాగా, ఈ టోర్నీ సూపర్-12 దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలున్నాయి. ఆదివారం రాత్రి స్కాట్లాండ్‌తో పాకిస్థాన్ ఆడనుంది. సోమవారం నమీబియాతో టీమిండియా తలపడుతుంది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ ఓటమి నేపథ్యంలో రేపు టీమిండియా-నమీబియా మ్యాచ్‌కు పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. ఈ టోర్నీలో గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా... గ్రూప్-2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు ఆప్ఘన్ వర్సెస్ కివీస్ : మ్యాచ్‌ ఫలితంపై భారత్‌ ఆశలు