పాకిస్థాన్ క్రికెటర్లపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత ఆటగాళ్లలో తమ దేశ ఆటగాళ్లు ధైర్యవంతులు కాదని, పిరికి పందలని అన్నారు. అదేసమయంలో పాకిస్థాన్ క్రికెట్ను తిరిగి గాడిలో పెట్టేందుు తన వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రికెట్ టోర్నీలో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు రెండు మ్యాచ్లలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో ఆ జట్టుపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, సీనియర్ క్రికెటర్లు ఏకిపారేస్తున్నారు. వారిలో ఒకరు షోయబ్ అక్తర్.
పాకిస్థాన్ ఆటగాళ్లు పిరికోళ్ల తరహాలో ఆడుతున్నారని విమర్శించారు. సైమ్ అయూబ్ విఫలమవుతాననే భయంతో ఆడుతున్నాడని, అదే అభిషేక శర్మ ఎలాంటి ఒత్తిడి లేకుడా స్వేచ్ఛగా ఆడుతున్నాడని అక్తర్ పోల్చాడు. పీఎస్ఎల్ వంటి లీగుల్లో పరుగులు చేయడం వేరని, అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడిని జయించి ఆడటమే అసలైన సవాలని అక్తర్ పేర్కొన్నారు.
అలాగే, తన చేతికి పాకిస్థాన్ జట్టును అప్పగిస్తే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతానని చెప్పారు. సైమ్.. నువ్వు వెళ్లి స్వేచ్ఛగా ఆడుకో... అభిషేక్ శర్మకు ఆడేందుకు లైసెన్స్ ఉంది.. నువ్వు కూడా అలాగే ఆడు. ఔటైనా ఫర్లేదు. నిన్ను జట్టు నుంచి తీసేయరు. ఈ యేడాది మొత్తం నదే అని ధైర్యంగా చెబుతా.. మెరుగైన ప్రదర్శన ఎలా రాదో చూస్తా అని అన్నారు. అయితే, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం తనను ఎట్టిపరిస్థితుల్లోనూ సంప్రదించబోదని అక్తర్ వ్యాఖ్యానించారు.