తన భార్య హసిన్ జహాన్ తన నెలవారీ భరణాన్ని పెంచాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. క్రికెటర్ షమీతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై తమ స్పందనలను సమర్పించడానికి నాలుగు వారాల సమయం ఇచ్చింది.
కోల్కత్తా హైకోర్టు మునుపటి ఉత్తర్వు ప్రకారం, హసిన్ జహాన్ ప్రస్తుతం తనకు నెలకు రూ.1.5 లక్షలు, తన కుమార్తెకు రూ.2.5 లక్షలు అందుకుంటున్నారు. అయితే, ఈ మొత్తం వారి జీవనశైలిని కొనసాగించడానికి, అవసరమైన ఖర్చులను తీర్చడానికి సరిపోదని జహాన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అందుచేత నెలకు పది లక్షల భరణం కావాలని కోర్టుకు తెలియజేశారు.
2018లో ప్రారంభమైన షమీ, జహాన్ మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న న్యాయ పోరాటంలో ఇది ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. గృహ హింస, వరకట్న వేధింపుల ఆరోపణలతో వారి వివాహ జీవితానికి బ్రేక్ పడింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న షమీ భారతదేశం తరపున స్థిరమైన ప్రదర్శన ఇస్తూనే ఉన్నాడు. క్రికెట్పై తన దృష్టిని కొనసాగిస్తున్నాడు. గత ఇంటర్వ్యూలో, తన వ్యక్తిగత సమస్యల గురించి అడిగినప్పుడు, షమీ గతం గురించి ఆలోచించకూడదని చెప్పాడు.
"నేను దేనికీ చింతించడం లేదు. పోయినది పోయింది. నేను నా క్రికెట్పైనే దృష్టి పెడుతున్నాను" అని షమీ చెప్పాడు. ప్రస్తుతం జహాన్ భరణం పెంపు విచారణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై షమీ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.