దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు ముచ్చటగా మూడోసారి తలపడనున్నాయి. ఈసారి టైటిల్ కోసం ఫైనల్లో ఢీకొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మాట్లాడుతూ భారత్తో మ్యాచ్ అంటే తీవ్ర ఒత్తిడి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఇప్పటివరకు చేసిన పొరపాట్లను పునరావృతం కాకుండా చూస్తామని తెలిపాడు.
ఇదే విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'ఇరు దేశాల మధ్య మ్యాచ్ అంటేనే అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ. క్రికెటర్లపైనా ఒత్తిడి ఉండటం సహజం. మరోలా చెబితే అది ఖచ్చితగా తప్పే. భారత్తో గత రెండు మ్యాచుల్లో మేం చాలా పొరపాట్లు చేశాం. అందుకే ఓడిపోయాం. తక్కువ తప్పులు చేసిన జట్టే గెలుస్తుంది. తప్పకుండా ఫైనల్లో ఆ పొరపాట్లను సరిదిద్దుకొని విజయం సాధించేందుకు ప్రయత్నిస్తాం' అని సల్మాన్ తెలిపాడు.
'భారత జట్టు ఏం చేయాలనుకుంటే అదే చేయనివ్వండి. మేం మాత్రం ఏసీసీ ప్రోటోకాల్స్ను ఫాలో అవుతాం. కలవాలని వారు వస్తే మేం ముందడుగు వేస్తాం. లేకపోతే ఏం చేయలేం. మా చేతుల్లో ఉండే వాటిపైనే దృష్టి పెడతాం. మీడియాలో వచ్చివని, బయట అనుకొనేవి వదిలేస్తాం. మా లక్ష్యం ఆసియా కప్. మేం ఇక్కడికి నాణ్యమైన క్రికెట్ ఆడటానికే వచ్చాం. తప్పకుండా ఫైనల్ గెలుస్తామని నమ్ముతున్నా' అని వ్యాఖ్యానించాడు.
'అండర్ -16 రోజుల నుంచి నేను ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నా. మా నాన్న కూడా క్రికెట్కు పెద్ద అభిమాని. గత 20 ఏళ్లకాలంలో నేనెప్పుడూ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు కరచాలనం చేసుకోకుండా ఉండటం చూడలేదు. అంతకుముందు కూడా ఇలా జరిగినట్లు నేను వినలేదు. భారత్, పాక్ దేశాల మధ్య పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్న రోజుల్లోనూ ఇలాంటివి చోటు చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం షేక్హ్యాండ్స్ ఇవ్వకపోవడం సరిగా లేదనిపిస్తోంది. ఇలాంటివి క్రికెట్కు మంచిది కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం' అని సల్మాన్ అఘా పేర్కొన్నాడు.